Minister Mallareddy | ఘట్కేసర్, జూన్ 7: మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్ల అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ప్రత్యేక ఫండ్, ఆర్అండ్బీ నిధులు సుమారు రూ. 92 లక్షలతో ఘట్కేసర్ మున్సిపాలిటీ 4,11,13,14 వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి శుక్రవారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. ప్రస్తుతం నగరం విస్తరించడంతో నగర జనాభా ఎక్కువ శాతం శివారు మున్సిపాలటీల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సీఎం కేసీఆర్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు సీఎం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. అనంతరం డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద ఏర్పాటు చేసిన నీటి సంపును ఆయన ప్రారంభించారు.
ప్రభుత్వం పేద మహిళల ఉపాధికి ప్రాధాన్యతనిస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. అలాగే న్యాక్, కార్మిక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మహిళా కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. మేడ్చల్ నియోజకవర్గంలో దాదాపు 2వేల మంది పేద మహిళా కుటుంబాలకు కుట్టు మిషన్లో శిక్షణ ఇచ్చి, అనంతరం కుట్టు మిషన్లను ఉచితంగా అందజేయనున్నట్లు వివరించారు. ఘట్కేసర్ సెంటర్లో ప్రస్తుతం 30 మందికి మహిళలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. న్యాక్ డైరెక్టర్ ఎం.రాజిరెడ్డి, ఘట్కేసర్ చైర్పర్సన్ పావనీ జంగయ్య యాదవ్, కమిషనర్ వేమనరెడ్డి, ఘట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, రైతు సొసైటీ చైర్మన్ ఎస్ .రాంరెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, కౌన్సిలర్లు బండారు ఆంజనేయులు గౌడ్, కొమ్మిడి అనురాధ, జాంగీర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.