బంజారాహిల్స్, నవంబర్ 15 : యాభైఏండ్ల పాటు పార్టీ కోసం కష్టపడిన మాలాంటి నాయకులకే అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దానం నాగేందర్కు మద్దతుగా జూబ్లీహిల్స్ డివిజన్ ఇందిరానగర్లో బుధవారం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా హాజరై విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడారు. నిజమైన కాంగ్రెస్ నాయకులను, వారి కుటుంబ సభ్యులను పక్కన పెట్టి తమ స్వార్థ రాజకీయాల కోసం టికెట్లు అమ్ముకున్న నీచమైన చరిత్ర ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేతలదని విమర్శించారు. కాంగ్రెస్ను నమ్ముకుంటే మోసపోవడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని, మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఖైరతాబాద్ నియోజకవర్గంలో దానం నాగేందర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ చేసిన మోసంతో తన రాజకీయ జీవితం ముగిసిపోయిందనుకున్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తనను పిలిచి పార్టీలో చేర్చుకున్నారని, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పీజేఆర్ అభిమానులు ఉన్నారని… వారందరినీ కలిసి బీఆర్ఎస్కు మద్దతు కూడగట్టాలని తనను ఆదేశించారని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మవద్దని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ… పేద ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టిన బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలని ప్రజలంతా నిర్ణయించుకున్నారని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ప్రజలంతా గుర్తించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఖైరతాబాద్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి కొల్లేటి దామోదర్ గుప్తా, బీఆర్ఎస్ నేతలు బోజిరెడ్డి, కిరణ్, డి. సింహం, సునీల్, కార్తిక్, శంకర్, కిరణ్ యాదవ్, దీపాదేవి, మల్లేశ్ యాదవ్, జ్యోతి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.