బేగంపేట్, డిసెంబర్ 24: ప్రపంచం మొత్తం గొప్పగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఆదివారం వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసంలో క్రైస్తవ ప్రముఖుల సమక్షంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం చర్చి పాస్టర్స్ ఆయనకు ఆశీర్వచనం చేశారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చర్చి పాస్టర్స్ కార్పొరేటర్లతో కలిసి కేక్కట్ చేసి పాస్టర్లకు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు పుట్టిన రోజును క్రిస్మస్ పర్వదినంగా జరుపుకుంటారని అన్నారు.
డిసెంబర్ నెల మొత్తం క్రిస్మస్ వేడుకలతో చర్చ్లు సర్వాంగా ముస్తాబు చేస్తారన్నారు. ప్రతి ఒక్కరు ఏసు చూపిన సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మి, మహేశ్వరి, హేమలతా, పాస్టర్లు శ్యాంసన్, విజయ్, క్రైస్తవ ప్రముఖులు ఫ్రాంక్లిన్, ప్రశాంత్, రాజ్గోపాల్దాస్, విలియమ్, జయరాజ్లోపాటు బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి, ఆకుల హరికృష్ణ, లక్ష్మీపతి, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.