సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : నిజాం కాలం నాటి పురాతన భవనాలు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మొజంజాహి మార్కెట్ తరహాలోనే 200 సంవత్సరాల చరిత్ర కలిగిన మీరాలం మండి పునరుద్ధరణ, ఆధునీకరణ పనులకు జీహెచ్ఎంసీ, కులీకుతుబ్షా పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) శ్రీకారం చుట్టింది. హెరిటేజ్ దెబ్బతినకుండా తగిన మరమ్మతులు, ఆధునీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ. 10.50 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానించారు.
మార్కెట్, పరిసర ప్రాంతాల్లో దెబ్బతిన్న క్యాచ్పిట్లకు మరమ్మతులు చేయడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త క్యాచ్పిట్లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేయనుంది. మెరుగైన పారిశుధ్య నిర్వహణ, రహదారులతో పాటు వరదనీరు సాఫీగా వెళ్లేలా తగు చర్యలు చేపట్టనున్నారు. ఎల్ఈడీ దీపాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. కాగా దాదాపు ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న మీరాలం మార్కెట్లో సుమారు 300 మంది కూరగాయల విక్రేతలున్నారు. పురాతన మార్కెట్ కొత్త కళను సంతరించుకోనుందని అధికారులు పేర్కొన్నారు. రెండేండ్ల లోపు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు.