సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): పురాతన మార్కెట్లకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే జాబితాలోకి మీరాలం మండి చేరింది. చారిత్రక, వారసత్వ సంపదను పరిరక్షించి, అలనాటి వైభవాన్ని తీసుకువచ్చే చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నది. ఇప్పటికే మోజంజాహీ మార్కెట్కు మరమ్మతులు చేసి అలనాటి వైభవాన్ని తీసుకువచ్చారు. అలాగే నిజాం కాలం నాటి పురాతన భవనాలు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణకు తగిన శ్రద్ధ చూపుతున్న ప్రభుత్వం.. మోజంజాహీ మార్కెట్ తరహాలోనే 200 సంవత్సరాల చరిత్ర కలిగిన మీరాలం మండి పునరుద్ధరణ, ఆధునీకరణ పనులకు జీహెచ్ఎంసీ, కులీకుతుబ్షా పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) శ్రీకారం చుట్టింది. వారసత్వ కట్టడాలు దెబ్బతినకుండా తగిన మరమ్మతులు, ఆధునీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించి ఈ మేరకు రూ. 16.14కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపడుతున్నట్టు ఆదివారం పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అత్యాధునిక హంగులతో అభివృద్ధి పనులను చేపట్టనున్నామని, ఎల్ఈడీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇతర మౌలిక వసతులను కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కాగా దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మార్కెట్లో సుమారు 300 మంది కూరగాయల విక్రేతలున్నారు. దీనిని అభివృద్ధి చేయడం ద్వారా అటు వ్యాపారులకు ఇటు పురాతన మార్కెట్ కొత్త కళను సంతరించుకోనుందని అధికారులు పేర్కొన్నారు. రెండేండ్ల లోపు పూర్తి చేసేలా పనులు చేపట్టనున్నారు.