ఖైరతాబాద్, మార్చి 9 : సమాచార హక్కు చట్టం ఒకరు.. ఇద్దరిది కాదని.. 150 కోట్ల మంది భారతీయులకు జవాబుదారీతనంగా నిలుస్తుందని ఉమ్మడి రాష్ట్ర మాజీ ప్రధాన సమాచార హక్కు కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. సమాచార హక్కు సాధన సమితి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శనివారం ‘సమాచార హక్కు చట్టం, అమలవుతున్న తీరు, ఎదురవుతున్న సవాళ్లు’ అనే అంశంపై సమితి రాష్ట్ర అధ్యక్షుడు గాదెపాక మధుకుమార్ అధ్యక్షతన సదస్సు జరిగింది.
ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నాడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చిందని, అయితే అదే చట్టం వల్ల ఇద్దరు కేంద్ర మంత్రులు తమ పదవులు సైతం కోల్పోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అంతటి సత్తా కలిగిన సమాచార హక్కు చట్టాన్ని ప్రస్తుత పాలకులు నిర్వీర్యం చేసే పని పెట్టుకున్నారన్నారు. తాను కమిషనర్గా ఉన్న కాలంలో ఏ రోజు కేసులను ఆ రోజే పరిష్కరించే వాడినని, తన హయాంలో ఏడు వేలకు పైగా కేసులను పరిష్కరించానని గుర్తు చేశారు.
సమాచారాన్ని ఇవ్వడం వల్ల ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. నేడు సమాచార హక్కు చట్టాన్ని విద్యావంతులు, న్యాయవాదులు, జర్నలిస్టులు సరిగా వినియోగించుకోవడం లేదన్నారు. ఈ చట్టంలో రాజకీయ నాయకులు సైతం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ డాక్టర్ వీవీ.రావు, ఉభయ రాష్ర్టాల మాజీ చీఫ్ ఇంజినీర్ ఎంఎ కరీం, ఆర్టీ కార్యకర్తలు పిట్టల ఈదయ్య, పెరక అభిలాష్, నజఋర్, లుక్మాన్, వంగాల మల్లేశ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.