సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలను మెరుపు వేగంతో దర్యాప్తు చేస్తే.. నేరగాళ్లను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుందని నగర పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. టెక్నికల్, ఫైనాన్స్ టీమ్లతో పాటు ఇతర రాష్ర్టాలలో నిరంతరం దర్యాప్తు బృందాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. బాధితులు జరిగిన మోసాన్ని గుర్తించేందుకు రోజులు, నెలలు పడుతుంది. గుర్తించిన తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మరింత సమయం పడుతుంది. ఈ సమయం సైబర్ నేరగాళ్లకు కలిసి వస్తోంది. బాధితులు ఫిర్యాదు చేసిన తరువాత.. వారిచ్చిన సమాచారంతో భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
సాంకేతికంగా, బ్యాంకింగ్ ఖాతాల పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్న పోలీసులు.. నిందితులను కట్టడి చేస్తున్నారు. నిందితులు ఏ రాష్ట్రంలో ఉన్నా.. అక్కడికి వెళ్లి పట్టుకుంటున్నారు. ఇతర రాష్ర్టాల్లో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కేసుల దర్యాప్తులో వేగం పెరుగుతుందని భావిస్తున్నారు.
సైబర్క్రైమ్ జరిగిందంటే వెంటనే బాధితులు 1930కు సమాచారం ఇవ్వాలి. ఆ తరువాత సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేస్తారు. ఈ కేసు నమోదు కావడంతోనే నిందితులు వాడిన ఫోన్ నంబర్లు, ఇంటర్నెట్కు సంబంధించిన వివరాలు విశ్లేషించేందుకు ఒక బృందానికి పంపిస్తారు. మరో బృందం.. బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక లావాదేవీలు జరిగిన తీరు, ఏయే ఖాతా నుంచి ఏ ఖాతాలోకి నగదు బదిలీ అయ్యింది.. చివరకు ఏ ఖాతాలోకి వెళ్లాయి.. ఎక్కడ డబ్బు డ్రా చేశారు.. తదితర అంశాలను వేగంగా గుర్తించేందుకు పనిచేస్తుంది.
సైబర్నేరగాళ్లు ఎక్కువగా ఢిల్లీ పరిసర ప్రాంతాలు, రాజస్థాన్, చత్తీస్ఘడ్, పశ్చిమబెంగాల్, యూపీ, బీహార్ నుంచి మోసాలు ఎక్కువగా చేస్తున్నారు. వీళ్లని గాలించేందుకు ఢిల్లీ పరిసరాల్లో ఒక బృందం అక్కడ పనిచేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం తరచూ ఢిల్లీకి ఆయా కేసుల దర్యాప్తులో భాగంగా బృందాలు వెళ్తుంటాయి. ఈ నేపథ్యంలో అక్కడ షిఫ్టుల వారీగా బృందాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ట్రై పోలీస్ కమిషనరేట్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే సైబర్నేరాల కోసం ఉపయోగపడే అవకాశం ఉంది. స్థానికంగా ఉండే అధికారులు ఎప్పటికప్పుడు ఢిల్లీలో ఉంటే బృందాలతో కేసుల దర్యాప్తుపై చర్చిస్తుంటారు. ఇక్కడ ఉండే సాంకేతిక బృందాలు, ఢిల్లీ పరిసరాల్లో ఉండే బృందాలు సమన్వయంతో పనిచేయడంతో వేగంగా కేసుల దర్యాప్తు పూర్తవుతుంది.
మోసం జరిగిందో..! లేదో.! తెలుసుకొని నిర్ధారణకు వచ్చిన తర్వాతే కేసు నమోదు, నిందితుల కోసం గాలిస్తున్నారు. పక్కా ఆధారాలతో ముందుకు వెళ్లడంతో సైబర్నేరగాళ్లు భయపడుతున్నారు. దీంతో నేరాల సంఖ్య తగ్గడంతోపాటు నేరం చేసిన వారు కూడా వెంటనే పట్టుబడే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
నేడు ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికీ నిత్యావసరంగా మారింది. అత్యాశకు పోయి చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. సైబర్నేరాలను కట్టడి చేసేందుకు టెక్నికల్, ఫైనాన్షియల్కు సంబంధించిన విశ్లేషణ వేగంగా చేసే విధంగా బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. దీనికి తోడు నిందితులను గుర్తించి, పట్టుకునే విధంగా యంత్రాంగాన్ని సిద్ధం చేస్తూ , ఢిల్లీ వంటి నగరాలలో నిరంతరం అక్కడ సిబ్బంది అందుబాటులో ఉండే లా చేయాలని ఆలోచిస్తున్నాం. ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న మూడు బృం దాలు సమన్వయం చేసుకోవడంతో కేసులు త్వరగా పరిష్కారమవుతాయి. దీనిపై ఇంకా విశ్లేషణ చేయాల్సి ఉంది. సైబర్నేరాలను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.
– ఏవీ. రంగనాథ్, హైదరాబాద్, జాయింట్ సీపీ (క్రైమ్స్)