మేడ్చల్, ఏప్రిల్ 14 : విద్యార్థులకు ప్లేస్మెంట్ ప్రధానం కాదని, ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని జేఎన్టీయూహెచ్ వైస్ చాన్సలర్ కట్టా నర్సింహారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. చాలా కళాశాలల్లో 100 శాతం ప్లేస్మెంట్ సాధించామని ప్రకటించుకుంటున్నాయన్నారు. అందులో రూ.3.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఎంతో మంది విద్యార్థులు ఉంటున్నారన్నారు. ఓ డ్రైవర్ కూడా ఈ రోజుల్లో నెలకు రూ.30వేలు సంపాదిస్తున్నారని, చదువుకు తగిన ఉద్యోగం ఉండాలని, తమ పరిజ్ఞానం, సృజనాత్మక శక్తితో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యార్థులు ఇంజినీరింగ్లో చేరేటప్పుడే తమకున్న అభిరుచి, సామర్థ్యాలకు అనుగుణంగా ఉండే రంగాన్ని ఎంచుకోవాలని, అప్పుడే జీవితంలో విజయం సాధించగలుతారని ఆయన చెప్పారు. కళాశాల చైర్మన్ వేముల మల్లారెడ్డి మాట్లాడుతూ.. తల్లిదండ్రులు కన్పించే దేవుళ్లని, తమ పిల్లల్ని ఉన్నత స్థాయికి తీసుకురావడానికి వారు ఎంతో కష్టపడుతారన్నారు. చాలా మంది ఉన్నత స్థాయికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసున్నారని, వృద్ధాప్యంలో పిల్లల తోడ్పాటు తల్లిదండ్రులకు ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రామకృష్ణారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి, కార్యదర్శి వేముల కృష్ణారెడ్డి, రెక్టార్ నరేందర్ రెడ్డి, అధ్యాపకులు రాఘవేందర్ రెడ్డి, భరత్సింహారెడ్డి, హెచ్వోడీలు, ఫ్యాకల్టీ, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.