వెంగళరావునగర్, జనవరి 10 : బిడ్డ ఎంత ఆకలితో ఉన్నదో.. పాలివ్వడానికి అనుమతించాలని ఓ తల్లి కన్నీళ్లతో వేడుకున్నది. బస్ చార్జీల కోసం బిడ్డలతో కలిసి భిక్షాటన చేస్తూ ఆ కుటుంబం ఆపరేషన్ స్మైల్ అధికారులకు చిక్కారు. ముగ్గురు చిన్నారులను వెంగళరావునగర్ డివిజన్లోని స్టేట్హోంలో అధికారులు చేర్పించారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం,పగిడ్యాలకు చెందిన కప్పెరి ఎల్లప్ప, నర్సమ్మ దంపతులు. వీరికి శైలజ (6), సంజు (4) , వైశాలి (ఏడాది) అనే ముగ్గురు సంతానం. ఎల్లప్ప శివరాంపల్లిలో నివాసముంటూ తాపీ కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
తమ ఊరికి వెళ్లిన కుటుంబసభ్యులు గత శుక్రవారం బేగంపేట్ రైల్వేస్టేషన్లో రైలు దిగి నగరానికి చేరుకున్నారు. అక్కడి నుంచి భార్యాపిల్లలతో ఎల్లప్ప నడుచుకుంటూ మెహిదీపట్నం రైతుబజార్ వద్దకు చేరుకున్నారు.అక్కడ కూరగాయలు ఏరుకుం టూ… బస్సు చార్జీల కోసం భిక్షాటన చేస్తుండగా వారిని ఆపరేషన్ స్మైల్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆరేళ్ల కుమార్తె శైలజ, నాలుగేళ్ల కుమారుడు సంజు, ఏడాది వయస్సున్న ఉన్న పాప వైశాలిని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ ప్రాంగణంలో ఉన్న శిశు విహార్కు తరలించారు. దీంతో 5 రోజుల నుంచి కమిషనరేట్ గేటు ఎదురుగా పడిగాపులు కాస్తూ లోపలికి అనుమతించాలని వేడుకుంటున్నారు ఆ పిల్లల తల్లిదండ్రులు.
బిడ్డకు పాలివ్వాలి..అనుమతివ్వండి : తల్లి నర్సమ్మ
ఐదు రోజుల క్రితం మా ముగ్గురు పిల్లల్ని స్టేట్హోంలో అధికారులు చేర్చారు. ఏడాది వయస్సున్న పాప వైశాలికి పాలివ్వాలని ఎంత వేడుకున్నా లోపలికి అనుమంతించట్లేదని తెలిపారు. బిడ్డల్ని చూసుకుంటామని, తమ పిల్లల్ని తమకు అప్పగించాలని కోరినా ఆలకించేవారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము భిక్షాటన చేసేవారం కాదని..బస్సు చార్జీల డబ్బు కోసమే అడుక్కున్నామని చెప్పినా అధికారులు వినట్లేదన్నారు. కనికరించి కన్నబిడ్డల్ని అప్పగించాలని కన్నీళ్లతో వేడుకుంటున్నారు.
కన్నతల్లిని అనుమతిస్తాం..
బిడ్డల్ని చూసుకునేందుకు కన్నతల్లి నర్సమ్మను స్టేట్హోం లోపలికి అనుమతిస్తాం. ఏడాది వయస్సున్న కుమార్తె వైశాలికి తల్లిపాలు ఇచ్చేందుకు సహకరిస్తాం. ఇక్కడే ఆశ్రయం పొందే ఆమె ముగ్గురు బిడ్డల్ని కూడా ఆమె చూసుకోవచ్చు. బిడ్డలతో పాటు తల్లి నర్సమ్మకు కూడా ఆశ్రయం కల్పిస్తాం. తదుపరి విచారణ కోసం కేసును రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేస్తాం.
– శైలజ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్