సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరంలో కీలకమైన రద్దీ ప్రాంతాలలో రోడ్డు దాటాలంటే పాదచారులు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితి. ప్రధానంగా బస్టాండ్ నుంచి రైల్వేస్టేషన్.. ఇక మెట్రో అందుబాటులోకి వచ్చాక మెట్రో స్టేషన్ల నుంచి రోడ్డు దాటి బస్టాండ్కు వెళ్లాలంటే గగనమే. కీలకమైన జంక్షన్లలో అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని రహదారిని దాటాలి. ముఖ్యంగా ప్రతి సంవత్సరం జరుగుతున్న ప్రమాదాల్లో రోడ్డు దాటే వారే ఎక్కువగా మరణిస్తున్నారు. దీంతో పాదచారుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా రద్దీ ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్వోబీ) పనులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కొన్ని అందుబాటులోకి తీసుకురాగా.. మరికొన్నింటి పనులను విడుతల వారీగా చేపడుతూ వస్తున్నది. నగరంలో రూ.50 కోట్ల 18 చోట్ల చేపడుతున్న ఎఫ్ఓబీ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. తుది దశలో ఉన్న ఈ ఎఫ్ఓబీలను వచ్చే నెల మొదటి వారంలో అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. ఇక ఈ ఎఫ్ఓబీలు అందుబాటులోకి వస్తే పాదచారులు సులువుగా రోడ్డు దాటవచ్చు