వ్యవసాయ యూనివర్సిటీ , డిసెంబర్ 18 : తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో పూల సాగుకు, ప్రధానంగా చామంతికి ఎక్కువ డిమాండ్ ఉన్నదని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. నీరజా ప్రభాకర్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పూల పరిశోధన స్థానం సమావేశపు మందిరంలో ఏర్పాటు చేసిన చామంతి సాగుపై రైతులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పూలకు, ప్రధానంగా చామంతికి దేశ వ్యాప్తంగా డిమాండ్ ఉందన్నారు. అందుకు అనుగుణంగా నేలలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నూతన వంగడాల విడుదలైనట్లు చెప్పారు. వరి, ఇతర పంటలకన్నా, తక్కువ నీటి వనరులతో ఎక్కువ పంట దిగుబడి, లాభాలు రావడంతో పూల సాగు పెరిగిందన్నారు. సాగు నీటి ప్రాజెక్టులు, చెరువు, కుంటల కింద వరి సాగు చేయగా, బోరుబావుల కింద ఎక్కువగా కూరగాయలు, పూలు సాగు చేస్తున్నారని తెలిపారు. భూగర్భ జలాలు పెరగడం, తెలంగాణ వాతావరణ పరిస్థితులు పూల సాగుకు అనుకూలంగా ఉన్నాయని గుర్తు చేశారు. సమీపంలోని ఉద్యాన అధికారులు, శాస్త్రవేత్తల సలహా మేరకు సీడ్ కొని సాగు చేయడం వల్ల మంచి లాభాలు పొందవచ్చన్నారు. తెలంగాణ లోని ఉమ్మడి మహబూబ్నగర్ , మెదక్, నల్గొండ, నిజామాబాద్తో పాటు, హైదరాబాద్ నగర చుట్టూ ఉన్న ప్రాంతాల్లో పూల సాగు గణనీయంగా పెరిగిందన్నారు. ఇటీవల విడుదలైన చీడపీడలను తట్టుకునే చామంతి రకాలను సాగు చేయాలని సూచించారు. నారు మళ్ల నుంచి, కోత, ఎగుమతుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయవచ్చని సూచించారు. కార్యక్రమంలో పరిశోధన సంచాలకులు డా. భగవాన్, శాస్త్రవేత్త డా. నవీన్ కుమార్ పాల్గొన్నారు.