Himayat Sagar | హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న హిమాయత్ సాగర్కు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. సాగర్కు 1000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 1340 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. హిమాయత్ సాగర్ గరిష్టస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1762 అడుగులుగా ఉంది.
ఉస్మాన్ సాగర్కు కూడా వరద కొనసాగుతోంది. హిమాయత్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మూసీ నదికి వరద పెరిగింది. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇవాళ సెలవు దినం కావడంతో జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు.