మారేడ్పల్లి, ఫిబ్రవరి 19: కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న మృతితో…స్థానిక ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు శోకసంద్రంలో మునిగిపోయారు. కొన్ని రోజులుగా గుండె, కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఎమ్మెల్యే జి. సాయన్న ఆదివారం కన్నుమూశారు. విషయం తెలుసుకున్న కంటోన్మెంట్కు చెందిన బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు.
మా కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయామంటూ ఎమ్మెల్యే అనుచరులు కన్నీటి పర్యంతమయ్యారు. కార్ఖానాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే జి. సాయన్న అకస్మాతుగా మృతి చెందడంతో కంటోన్మెంట్ ప్రజలందరూ ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఎమ్మెల్యే జి. సాయన్నకు నివాళులు
బోయిన్పల్లి బాపూజీనగర్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే జి. సాయన్న చిత్రపటానికి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, ఎమ్మార్పీఎస్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ… ఎమ్మెల్యే సాయన్నతో తనకు మంచి అనుబంధం ఉందని, ఆయన మృతి కంటోన్మెంట్ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో అజిత్ కళ్యాణ్, శ్రీకాంత్, ప్రేమ్ ముదిరాజ్, రాముగౌడ్, బీజేపీ నాయకులు బట్టు శంకర్ తదితరులు పాల్గొన్నారు.