Hyderabad | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఓ యువతితో పాటు నలుగురు యువకులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం తెల్లవారుజామున బైక్ను కారు ఢీకొన్న ఘటనలో తారక్ అనే బౌన్సర్ మృతి చెందాడు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్ గురువారం మీడియాకు వివరించారు.
ఏ1గా కొవ్వూరి రిత్విక్ రెడ్డి, ఏ2గా వైష్ణవి, ఏ3గా పొలుసాని లోకేశ్వర్ రావు, ఏ4గా బుల్లా అభిలాష్, ఏ5గా అనికేత్ అరెస్ట్ అయినట్లు చెప్పారు. హిట్ రన్ కేసులో తారక్ రామ్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడని.. ఏసు రాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయన్నారు. పోలీసులు పట్టుకుంటారనే భయంతో ఏ1 రిత్విక్ రెడ్డి పరారయ్యాడన్నారు. కారును బీహెచ్ఈఎల్లో దాచి పెట్టారని తెలిపారు. నిందితుల కోసం గాలించి.. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా అరెస్ట్ చేశామని ఏసీపీ వెల్లడించారు.
రిత్విక్ రెడ్డి అమేజాన్లో జాబ్ చేస్తున్నాడని… ఆఫీస్ చూపిస్తానని మిగిలిన ఫ్రెండ్స్ను తీసుకెళ్లాడన్నారు. రిత్విక్ రెడ్డి మద్యం మత్తులో ఉండి డ్రైవ్ చేశాడని.. అలాగే మద్యం మత్తులో ఉన్నాడని తెలిసి మిగిలిన వారు కారులో ప్రయాణించారన్నారు. దీంతో కారులో ప్రయాణించిన వారిని కూడా నిందితులుగా చేర్చామని చెప్పారు. ఈ హిట్ అండ్ రన్ కేసులో ఏ1 రిత్విక్ రెడ్డిపై 304 ( 2) కింద కేసులు నమోదు చేశామన్నారు. దీంతో పాటు 337 ఐపీసీ , 337, 187 ఎంవీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. వీరంతా తుకారం గేట్ వద్ద మద్యం కొనుగోలు చేసినట్లు ఏసీపీ హరిప్రసాద్ తెలియజేశారు.