సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా బుధవారం సీయూ, బీయూ, వీవీ ప్యాట్ల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. బుధవారం కమిషనర్ తన చాంబర్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు కేటాయించాల్సి ఉన్న కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్ల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ గురించి జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరిస్తూ ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఈ ప్రక్రియ మొత్తాన్ని స్క్రీన్ ద్వారా చూపించారు. ర్యాండమైజేషన్ ద్వారా ఖరారైన జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు, ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ర్యాండమైజేషన్ జాబితా ఆధారంగానే జిల్లాలోని హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లు కేటాయిస్తామని కమిషనర్ రొనాల్డ్ రాస్ పేర్కొన్నారు. 15 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మొత్తం 3986 పోలింగ్ కేంద్రాలు ఉండగా..ఎన్నికల సంఘం ఆదేశానుసారం 25 శాతం అదనంగా బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లను రిజర్వ్లో ఉంచుతామని, 40 శాతం వీవీ ప్యాట్లను రిజర్వ్లో ఉంచేలా అదనంగా కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ, పూర్తి పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియను చేపడుతున్నామన్నారు. ఆనంతరం సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి బీయూ, సీయూ, వీవీ ప్యాట్ల మొదటి ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి, సికింద్రాబాద్ ఆర్వో హేమంత్ కేశవ్ పాటిల్, కంటోన్మెంట్ ఆర్వో సీఈవో మధుకర్ నాయక్, ఎన్నికల అదనపు కమిషనర్ అలివేలు మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.
రికార్డు స్థాయిలో ఆస్తిపన్ను వసూళ్లు.. అభినందనలు
ఆస్తిపన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు స్థాయిలో అద్భుతమైన వసూళ్లను సాధించిందని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. జీహెచ్ఎంసీ 2023-24 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో ఆస్తిపన్ను వసూలైన నేపథ్యంలో అందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందికి బుధవారం బంజారాహిల్స్లోని బంజారాభవన్లో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేవారు. గతంలో కంటే ఎక్కువ లక్ష్యాన్ని మించి పన్ను వసూలు చేయడం చాలా సంతోషంగా ఉన్నదని ఈ సందర్భంగా కమిషనర్ రొనాల్డ్ రాస్ అన్నారు. వివిధ కేటగిరీ ఉద్యోగులు పూర్తి బాధ్యతతో పనిచేశారని, జోనల్ స్థాయిలో క్షేత్రస్థాయిలో మైక్రో ప్లానింగ్ అమలు చేయడంతో ఈ ఫలితాలు వచ్చాయని, పన్నుల వసూళ్లలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ కమిషనర్ ఈ సందర్బంగా అభినందించారు. అత్యధికంగా పన్ను వసూలు చేసిన బిల్ కలెక్టర్కు, ట్యాక్స్ కలెక్షన్ ఇన్స్పెక్టర్లకు, డిప్యూటీ కమిషనర్లకు కమిషనర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లపై స్పెషల్ ఫోకస్
లోక్సభ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల వద్ద పటిష్ట చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారులైన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పాటిల్ హేమంత్ కేశ పాటీల్, నగర అదనపు పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్, ఆయా డీసీపీలతో కలిసి బుధవారం అదనపు నోడల్, సబ్ నోడల్ అధికారులు, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల, ఆర్ఓ, ఏఆర్ఓలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మార్గ నిర్దేశం చేశారు.