శంషాబాద్ రూరల్, మార్చి 29 : నివాస ప్రాంతాల్లో ఉన్న ఓల్డ్ స్క్రాప్ గోదాంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన శుక్రవారం శంషాబాద్ పట్టణంలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. శంషాబాద్ పట్టణంలోని రాళ్లగూడ రోడ్డులో ఉన్న కేజీఎస్ ఓల్డ్ స్క్రాప్ గోదాంలో ఉదయం 10 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగినట్టు సమాచారం రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్, మున్సిపల్ సిబ్బంది కలిసి మంటలు అదుపుచేశారు.
నివాస ప్రాంతాల్లో గోదాంలకు అనుమతి ఇవ్వకూడదని స్థానికులు కోరారు. స్థానిక మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలన్నారు. గోదాం చుట్టూ ఉన్న చెత్తకు ఎవరో నిప్పుపెట్టారని, దీంతో అగ్నిప్రమాదం సంభవించిందని గోదాం యజమాని మహ్మద్ జహంగీర్ తెలిపారు. దాదాపు రూ. 10 లక్షల మేరకు ఆస్తి నష్ట జరిగినట్టు పేర్కొన్నారు. లక్షకు పైగా జనాభా ఉన్న ఈ ప్రాంతంలో ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపారు.