అగ్ని మాపక శాఖ డైరెక్టర్ లక్ష్మీ ప్రసాద్
హైటెక్స్ ప్రాంగణంలో 25 రకాల ఫైర్ సర్వీస్ వాహనాలతో ప్రదర్శన
హైటెక్స్ నుంచి సికింద్రాబాద్ వరకు అగ్నిమాపక సర్వీస్ వాహనాలతో ర్యాలీ
మాదాపూర్, ఏప్రిల్ 20: ప్రజలు అత్యవసర సమయం లో అంబులెన్స్కు ఏ విధంగా దారి ఇస్తారో ఫైర్ సర్వీస్ వాహనాలకు కూడా అదే విధంగా దారి ఇచ్చినట్లయితే, మంటలంటుకున్న భవనాలను త్వరగా ఆర్పవచ్చని, దీంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని నివారించే అవకాశం ఉంటుందని అగ్ని మాపక శాఖ డైరెక్టర్ లక్ష్మీ ప్రసాద్ పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మంగళవారం తెలంగాణ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మాదాపూర్లోని హైటెక్స్ ప్రాంగణంలో 25 రకాల అగ్నిమాపక సర్వీస్ వాహనాలతో పాటు మిస్ట్ మోటార్ వాహనాలను ప్రదర్శించారు. అనంతరం, ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీస్ బీవీ నారాయణరావు, రిజనల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య, డిస్ట్రిక్ ఫైర్ ఆఫీసర్ శ్రీధర్రెడ్డిలతో పాటు ఫైర్ సర్వీస్ సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా మాదాపూర్ నుంచి మెహిదీపట్నం మీదుగా సికింద్రాబాద్ వరకు అగ్నిమాపక సర్వీస్ వాహనాలతో ర్యాలీని నిర్వహించారు.
ఈ సందర్భంగా లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ, 1944లో విక్టోరియా డాక్ ముంబైలో ఎస్ఎస్ ఫోర్త్ స్రైకిన్ అనే షిప్ ఘోర అగ్ని ప్రమాదానికి గురికావడంతో అందులో 66 మంది ఫైర్ ఫైటర్స్ మృతి చెందినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో వారి త్యాగానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలను జరుపుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీనిలో భాగంగానే అగ్నిమాపక యంత్రాలను ఉపయోగించి ర్యాలీని చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం అత్యవసర సమయంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా మిస్ట్ మోటార్ సైకిల్స్ను వాడటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మాదాపూర్ ఫైర్ సర్వీస్ అధికారి జగన్మోహన్, జగన్లు తదితరులు పాల్గొన్నారు.