సిటీబ్యూరో/అబిడ్స్/సుల్తాన్బజార్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): నాంపల్లి బజార్ఘాట్లో సోమవారం ఉదయం జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకపక్క ఇండ్ల నుంచి ఆర్తనాదాలు.. మరోపక్క కెమికల్ డబ్బాలు పేలడంతో పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి.. దీంతో ప్రమాదం జరిగిన భవనం చుట్టూ ఉన్న కుటుంబాలు భయంతో వణికిపోయాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక, బల్దియా, సంబంధిత ఇతర శాఖలు వెంటనే స్పందించాయి. అప్పటికే ప్రమాదస్థాయి పెరిగిపోయి.. ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగిపోయింది.
ఆదివారం దీపావళి పండుగ కావడంతో చాలా మంది అర్ధరాత్రి దాటేవరకు ప్రజలు మేల్కొనే ఉన్నారు. విద్యా సంస్థలకు సెలవు కావడంతో సోమవారం ఆలస్యంగా నిద్రనుంచి మేల్కొన్నారు. కొంతమంది పిల్లలు సోమవారం ఉదయం తమ ఇండ్ల ముందు పటాకులు కాల్చారు.
ఈ క్రమంలోనే ఉదయం 9 గంటల సమయంలో బజార్ఘాట్లోని రమేశ్ కుమార్ జైస్వాల్కు చెందిన బాలాజీ అపార్టుమెంట్ సీల్ట్ (గ్రౌండ్) అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ భవనం నాలుగు అంతస్తుల్లో ఉంది. రమేశ్ వృత్తిరీత్యా కెమికల్స్తో కూడిన ఆయిల్స్ విక్రయిస్తుంటాడు. అపార్టుమెంట్ వెనుకాలే అతడి నివాసం ఉంది. ముందున్న తన అపార్టుమెంట్లోని గ్రౌండ్ ఫ్లోర్ను కెమికల్స్ డ్రమ్ల గోడౌన్గా ఉపయోగించుకుంటున్నాడు. ఇక్కడి నుంచే తన కెమికల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పక్కన కెమికల్ డబ్బాలు నిల్వ చేశాడు. మరోపక్క ఆ అపార్టుమెంట్లో ఉన్న ఎనిమిది ఫ్లాట్లకు సంబంధించిన కుటుంబాలు తమ వాహనాలను పార్కింగ్ చేస్తారు.
రమేశ్ సెల్లార్లో నిల్వ చేసిన కెమికల్స్కు మండే స్వభావం ఉంది. నిల్వచేసిన వాటిలో పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన రసాయనాలు, ప్లాస్టిక్, ఫైబర్ షీట్లు ఉన్నాయి. ప్రమాదకరమైన ఈ రసాయనాల నిల్వ విషయంలో రమేశ్ ఎలాంటి జాగ్రత్తలు పాటించ లేదు. గోడౌన్ను అక్కడి నుంచి తరలించాలంటూ స్థానికులు, కిరాయి దారులు కూడా అనేక సార్లు యజమాని రమేశ్ను కోరారు. నా ఇల్లు.. నా ఇష్టం.. అన్నట్టు రమేశ్ వ్యవహరించడమే ఈ ప్రమాదానికి కరణమని స్థానికులు చెబుతున్నారు. ఇంత ప్రమాదకరమైన రసాయలు నిల్వ ఉంచినా.. సంబంధిత శాఖలు గుర్తించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యజమాని నిర్లక్ష్యం వల్లే తొమ్మిది మంది మృతి చెందారని, మరికొందరు గాయపడ్డారని, గ్రౌండ్ ఫ్లార్లో పార్కింగ్ చేసిన ఒక కారుతో పాటు దాదాపు 12 బైక్లు ఖాళీపోయాయని తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టంతో పాటు ఆస్తినష్టం కూడా జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.
బజార్ఘాట్లోని రసాయనాల గోడౌన్లో చెలరేగిన మంటలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రౌండ్ ఫ్లోర్లో అంటుకున్న మంటలు కొద్ది సేపటిలోనే .. మొదటి అంతస్తు నుంచి పై అంతస్తులకు వ్యాపించాయి. ప్రమాదస్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. మరోవైపు జీహెచ్ఎంసీ- డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యలు చేపట్టాయి. అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డితో పాటు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు నారాయణరావు, సుధాకర్రావు, హరినాథ్రెడ్డి, ధనుంజయ్రెడ్డి, మధుసూదన్రావు తదితర అధికారులు పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేశారు.
పటాకుల వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే, షార్ట్ సర్క్యూట్తో పాటు, సెల్లార్లో ఉన్న ఏదైనా పాత వాహనం స్టార్ట్ చేసే సమయంలో వచ్చిన స్పార్క్.. కెమికల్స్కు అంటుకొని కూడా ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నదన్న వాదన కూడా వినిపిస్తున్నది. పెట్రోలియంతో కూడిన రసాయనాలు ఉండటం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నదని అధికారులు తెలిపారు. మంటలు వ్యాపించిన సమయంలో వెలువడే పొగలో కార్బన్ మోనాక్సైడ్ ఉంటుందని, ఈ పొగను పీల్చుకున్న వారు ఊపిరాడక వెంటనే అపస్మారక స్థితిలోకి వెళుతారని చెప్పారు. ఈ ప్రమాదంలో కూడా రసాయనాలతో కూడిన పదార్థాల పొగలు అలుముకున్నాయి. ఈ పొగతో వచ్చిన కార్బన్ మోనాక్సైడ్తో పాటు ఇతర హానికరమైన వాయువులు మనుషుల ప్రాణాలను హరించి వేశాయన్నారు.
నేను స్విగ్గీలో పనిచేస్తూ ఈ భవనం పక్కనే ఉన్న ఇంటికి వాచ్మన్గా పనిచేస్తున్నాను. నా బైక్ను బాలాజీ అపార్టుమెంట్ ముందు పార్కు చేశాను. ఈ అగ్నిప్రమాదంలో బైక్ పూర్తిగా ఖాళీపోయింది. భవనంలో చెలరేగిన మంటలతో భయపడ్డాం. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పొగలు వచ్చిన విషయాన్ని గుర్తించాం. ప్రమాదం ఎలా జరిగిందో తెలియదు. ఇప్పుడు తాను స్విగ్గీలో ఎలా పనిచేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
దీపావళి పండుగ సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి వరకు వేడుకల్లో ఉన్నాం. సోమవారం ఉదయం కొంత ఆలస్యంగా నిద్రనుంచి మేల్కొన్నాం. భవనంలో మంటలంటుకున్నాయని తెలియగానే అందరం అక్కడికి చేరుకున్నాం. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించాం. అప్పటికే మంటలు తీవ్ర స్థాయిలో చెలరేగడంతో పాటు నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. ఆ భవనంలో ఉంటున్న కుటుంబాలు అరుస్తూ.. పెద్ద పెద్దగా కేకలు వేశారు. చాలా బాధ వేసింది. నివాసాల మధ్య రసాయనాల గోడౌన్లను ఏర్పాటు చేయవద్దన్నారు. ఈ ఘటనతోనైనా అధికారులు ఆలోచించాలి.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి… ఈ ఘటన తమను కలిచి వేసింది.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.