శంషాబాద్ రూరల్/సుల్తాన్బజార్, ఫిబ్రవరి 12 : ఎస్ఎస్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీలో ఆదివారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది గాయపడ్డారు. వారందరినీ చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గగన్పహాడ్ పారిశ్రామిక వాడలోని ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ కంపెనీలో గడువు ముగిసిన ఫార్మాస్యూటికల్ మందులు, కాస్మోటిక్స్, ఇతర రసాయనాలను విడివిడిగా బ్యాగుల్లో నింపి ఉంచారు. గడువు ముగిసిన రసాయనాలతో కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ సమయంలో అక్కడ ఉత్తరప్రదేశ్కు చెందిన 11 మంది కార్మికులు పని చేస్తున్నారు. ఈ ప్రమాదంలో చిక్కుకొని వారంతా గాయపడ్డారు. విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని.. గాయపడిన సద్దాం, సోహిల్, రాయల్, అఫ్తాబ్, ఇస్లాం, కమిల్, మామా, ప్రతాప్, ఆర్మాన్, హసిన్ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాలం చెల్లిన రసాయనాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు.
ఆరుగురి పరిస్థితి విషమం..
గగన్పహాడ్ స్క్రాప్ దుకాణంలో సంభవించిన పేలుడు ఘటనలో గాయపడ్డ 11 మంది ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. బర్నింగ్ వార్డులో చికిత్స పొందుతున్న ఈ 11 మందిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. మరో ఐదుగురి పరిస్థితి నిలకడగానే ఉన్నదని ప్లాస్టిక్ సర్జరీ విభాగం వైద్యులు తెలిపారు. దవాఖానలో ప్రస్తుతం రాయల్, అస్లం, సద్దాం, అఫ్తాబ్, కమల్, సోహెల్, ప్రతాప్ సింగ్, మామా చికిత్స పొందుతున్నారు.