హైదరాబాద్: నగర శివార్లలోని మైలార్దేవ్పల్లి టాటానగర్లో (Tata Nagar) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున టాటానగర్లోని ఓ పరుపుల గోదాంలో (Mattress godown) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా గోదాం మొత్తానికి విస్తరించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
కాగా, షార్ట్ సర్క్యూట్ (Short circuit) కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని చెప్పారు. రూ.15 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.