Swapnalok Fire Accident | హైదరాబాద్/సిటీబ్యూరో, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అడుగడుగునా కాంప్లెక్స్ అసోసియేషన్ నిర్లక్ష్యం ఉందని, వారు ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతోనే ప్రాణనష్టం సంభవించిందని తెలంగాణ రాష్ట్ర విపత్తుల స్పందన, ఫైర్ సర్వీసెస్ డీజీ వై.నాగిరెడ్డి తెలిపారు. స్వప్నలోక్లో జరిగిన అగ్ని ప్రమాదానికి ముఖ్య కారణం షార్ట్సర్క్యూట్ అని, ఇందుకు కాంప్లెక్స్ యజమానుల నిర్లక్ష్యం తోడవటంతో సహాయక చర్యలు ఆలస్యమైనట్లు తెలిపారు. ఈ మేరకు ప్రమాదానికి కారణమైన అంశాలు, భద్రతా లోపాలు, తమ సిబ్బంది స్పందించిన తీరుపై ఆయన శుక్రవారం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. స్వప్నలోక్ కాంప్లెక్స్లోని మొదటి అంతస్తులో ఉన్న ఎలక్ట్రికల్ డక్ట్లో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు పేర్కొన్నారు.
సికింద్రాబాద్లో జరిగిన డెక్కన్మాల్ అగ్ని ప్రమాద ఘటన తర్వాత జీహెచ్ఎంసీ, స్థానిక పోలీసులు, విద్యుత్ అధికారులు, ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఆధ్వర్యంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద జీహెచ్ఎంసీ పరిధిలో 1150 వాణిజ్య భవనాల్లో తనిఖీలు చేపట్టారు. 650 పరిశ్రమలు, రసాయన గోడౌన్లు, స్క్రాప్ గోడౌన్లలో సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. స్వప్నలోక్ ఫైర్ ఫైటింగ్ సిప్టమ్లో లోపాలు గుర్తించిన అధికారులు వెంటనే వాటిని సరిదిద్దుకోవాలని సూచనలు చేసింది. అయితే.. దానికంటూ యజమాని ఎవరూ లేకపోవడం, వ్యాపారాలు చేసుకునేవారంతా అసోసియేషన్గా ఏర్పడి దానిని నిర్వహిస్తుండటంతో అధికారులిచ్చిన ఆదేశాలను బేఖతారు చేశారు. అలా నోటీసులిచ్చి వారం రోజులు కూడా కాలేదు. అప్పుడే ప్రమాదం సంభవించింది.