బంజారాహిల్స్ : ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో దళితబంధు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. నియోజకవర్గంలో సుమారు 150మందిదాకా దళిత బంధు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో అర్హులను ఎంపిక చేసేందుకు చర్యలు ప్రారంభించారు.
లబ్దిదారుల ఎంపికను పారదర్శకంగా చేపట్టేందుకు మంగళవారం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డా.రమేష్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో సమావేశమయ్యారు. దళితబంధు కింద వచ్చిన దరఖాస్తుల వివరాలను, దరఖాస్తుదారులు అందించిన వ్యాపార వివరాలు, స్వయం ఉపాధికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించారు.
ఇంటింటికీ వెళ్లి సోషియో ఎకనామిక్ పరిస్థితిపై ఆరా తీసిన అనంతరం లబ్దిదారుల తుదిజాబితాను ఖరారు చేస్తారని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. మొదటి దశలో పైలట్ ప్రాజెక్ట్ గా నియోజకవర్గంలో 100మంది చొప్పున దళిత బంధు ఇస్తారని. రెండో దశలో నియోజకవర్గంలో 2వేలమందికి దళితబంధు అందిస్తామన్నారు.
అర్హులైన వారందరికీ దళితబంధు ఇప్పించే బాధ్యత తనదే అని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. త్వరలోనే బీసీలకు,మైనార్టీలకు కూడా దళిత బంధు లాంటి పథకాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. రానున్న పదిరోజుల్లో తొలివిడత దళిత బంధు పంపిణీ పూర్తవుతుందన్నారు.