బంజారాహిల్స్,నవంబర్ 9: గతంలో పనిచేసి, మానేసిన యజమాని తన కుటుంబంతో కలిసి ఫామ్హౌజ్కు వెళ్లినట్లు వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలుసుకున్న కారు డ్రైవర్.. అతడి ఇంట్లోకి ప్రవేశించి రూ.45 లక్షలు తస్కరించాడు. ఈ ఘటన ఫిలింనగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్నది. వివరాలను ఇన్స్పెక్టర్ రామకృష్ణ గురువారం విలేకరులకు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పేదాడ రామకృష్ణ(29) పటేల్నగర్లో నివాసముంటూ కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా జల్సాలకు అలవాటు పడిన అతడు డబ్బుల కోసం చోరీ చేస్తున్నాడు. గతంలో అతడు జూబ్లీహిల్స్ రోడ్ నం. 78లోని ఫీనిక్స్ అపార్ట్మెంట్స్లో నివాసముంటున్న వడ్లమూడి శ్రీహర్ష అనే వ్యాపారివద్ద కారు డ్రైవర్గా పనిచేశాడు.
ఆ సమయంలో యాజమాని వద్దనుంచి ఫ్లాట్ తాళం చెవి కాజేసి తన వద్దనే ఉంచుకున్నాడు. కాగా, పని మానేసినా తాళం చెవి మాత్రం రామకృష్ణ వద్దనే ఉంచుకున్నాడు. ఎలాగైనా శ్రీహర్ష ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్న నిందితుడు.. అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 5న శ్రీహర్ష తన కుటుంబ సభ్యులతో కలిసి మొయినాబాద్లోని ఫామ్హౌజ్కు వెళ్లినట్టు వాట్సాప్ స్టేటస్ ద్వారా నిందితుడు తెలుసుకున్నాడు. తన వద్దనున్న తాళం చెవితో ఇంట్లోకి ప్రవేశించాడు.
కప్ బోర్డులో ఉన్న రూ.45 లక్షలను తీసుకొని ఉడాయించాడు. ఫామ్హౌజ్ నుంచి తిరిగి వచ్చిన శ్రీహర్ష ఇంట్లో దొంగతనం జరిగినట్టు గుర్తించి.. ఈనెల 7వ తేదీన ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు రామకృష్ణను బుధవారం రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడి వద్ద నుంచి రూ.45లక్షల నగదుతో పాటు ఇంటి తాళం చెవిని స్వాధీనం చేసుకుని, రిమాండ్కు తరలించారు. వాట్సాస్ స్టేటస్ పెట్టే సమయంలో కొంచెం ఆలోచిస్తే ఇలాంటి పరిస్థితి రాదని ఇన్స్పెక్టర్ ప్రజలకు సూచించారు.