అమీర్పేట్, ఫిబ్రవరి 8 : సీఎం కేసీఆర్ ఆశించిన విధంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణ దిశగా ముందుకు తీసుకువెళ్తున్న తీరు ప్రశంసనీయమని సినీ నటుడు సోనూసూద్ అన్నారు. కోట్లాది నిధులతో సరికొత్త రూపు సంతరించుకుంటున్న అమీర్పేట్లోని ప్రకృతి చికిత్సాలయాన్ని బుధవారం అచ్చంపేట ఎమ్మెలే గువ్వల బాలరాజు, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆయుష్ కమిషనర్ ప్రశాంతితో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా చికిత్సాలయ ఆవరణలో నిర్మాణంలో ఉన్న కాటేజీలు, భోజనశాల, యోగా ప్రాంగణంతో పాటు ఇక్కడ అందుతున్న వైద్యం, డైట్లను పరిశీలించారు. చికిత్సాలయ ఆవరణలో నెలకొన్న పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ సీఎం కేసీఆర్ సంకల్పాన్ని సాధించే దిశగా మంత్రి హరీశ్రావు కృషిని ఆయన అభినందించారు. వైద్యులు, విద్యార్థులతో కలిసి సంపంగి మొక్కను నాటారు. ఈ సందర్భంగా సోనూసూద్తో కలిసి వైద్యులు, విద్యార్థులు సెల్ఫీలు తీసుకున్నారు.