సిటీబ్యూరో, నవంబర్ 21(నమస్తే తెలంగాణ)/తెలుగు యూనివర్సిటీ : ఒక్కొక్కరిది ఒక్కో హాబీ.. కొందరికి మొక్కలు పెంచడం ఇష్టమైతే.. మరికొందరికి ట్రావెలింగ్ అంటే ఇష్టం. అలాగే చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే నాణేలు, కరెన్సీలను సేకరించడం చాలామందికి ఉన్న ప్రత్యేక హాబీ. ఇదే అభిరుచి కలిగిన అనేకమందిని ఒకే వేదిక మీదకు తెచ్చింది హైదరాబాద్కు చెందిన ఫిలాటెలిక్ అండ్ హాబీస్ సొసైటీ. ఫెడరేషన్ ఆఫ్ టి ఛాంబర్స్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో సొసైటీ అధ్యక్షులు అగర్వాల్ ప్రకాశ్ నేతృత్వంలో రాజుల కాలం నుంచి ఆధునిక కాలం వరకు చలామణిలో ఉన్న నాణేలు.. దేశ విదేశాల్లో ముద్రించిన కరెన్సీలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. మూడు రోజులపాటు నిర్వహించిన ఈ కరెన్సీ ఎగ్జిబిషన్ ఈనెల 19న ప్రారంభమైన సోమవారంతో ముగిసింది. చివరి రోజు ఎగ్జిబిషన్ ప్రాంగణం నాణేలు, కరెన్సీ సేకరణ అభిరుచి కలిగిన వ్యక్తులు, పాఠశాలల విద్యార్థులతో కిటకిటలాడింది.
విష్ణుకుండినులు, కాకతీయులు, శ్రీకృష్ణ దేవరాయలు, అసఫ్ జాహీలు తదితర రాజులు తమ పాలనలో
నాణేలలో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. అలాగే కరెన్సీలపై తొలి రోజుల్లో బ్రిటీష్ చిహ్నాలు చలామణిలో ఉన్నా..ఆ తర్వాత ఆయా రాజుల హయాంలో అశోక చక్రంతో నాణేలు చలామణి అయ్యాయి. ప్రతి దశలో వచ్చిన మార్పులు ఎగ్జిబిషన్లో ఆసక్తిని కలిగించాయి.
చిల్లి గవ్వలు : శాతవాహనుల కంటే ముందుగా పాలించిన మౌర్యుల హయాంలో గవ్వలను నాణేలుగా చలామణి చేశారు. సీసం పోసిన గవ్వలను గవ్వగా, పలిగిన గవ్వలను చిల్లి గవ్వగా వెల కట్టేవారు. ఆ తర్వాత కాలంలో సత్తు బిల్లలు వాడుకలోకి వచ్చాయి.
ఫలుస్: హైదరాబాద్లోని గోల్కొండ ఖిల్లాను పాలించిన కుతుబ్షాహీ రాజవంశానికి చెందిన మహ్మద్ కులీకుతుబ్ షా పాలనలో చలామణిలో ఉన్న నాణెం ఇది. ‘ఫలుస్’ పేరుతో పిలుస్తూ కాలక్రమేణా ‘పైసా’గా
వ్యవహారికంలోకి వచ్చింది.
అంక : ఓరుగల్లు(వరంగల్) రాజధానిగా కాకతీయ వంశానికి చెందిన రెండో ప్రతాపరుద్రుడు పాలన సాగించిన కాలంలో చలామణిలో ఉన్న నాణెం ఇది. ఈ నాణేన్ని ‘అంక’ పేరుతో పిలిచేవారు.
వరహా: కాకతీయ వంశానికి చెందిన రాయ గజకేసరి రుద్రమదేవి పాలించిన కాలంలో ముద్రించిన ఈ నాణెం
‘వరహా’ పేరుతో చలామణి అయ్యింది.
రూపీ : హైదరాబాద్ను పాలించిన నిజాం అలీ ఖాన్ ‘రూపీ’ పేరుతో చలామణిలో ఉన్న నాణెం ఇది.
బ్రిటిష్ కాయిన్స్: బ్రిటిష్ ప్రభుత్వంలో చలామణిలో ఉన్న నాణేలు ఇవి. 1/2 రూపీ, 1/4 రూపీ, వన్ రూపీగా చలామణిలో ఉండగా.. నాలుగు అణాలు ఒక్క రూపాయి సమానం.
ఇండియన్ కాయిన్స్: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ముద్రణకు నోచుకుని చలామణిలో నాణేలు ఇవి. ఒక్క పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు పైసలు, పది పైసలు, ఇరవై పైసలు, యాభై పైసలు, రూపాయి నాణేలు ఇవి.
నిజాం కాయిన్స్: నిజాం ప్రభుత్వ హయాంలో చలామణిలో ఉన్న నాణేలు ఇవి. ఏకాణా, దోతాణా, చారాణా, ఆఠాణా పేరుతో చలామణి అయ్యాయి. 16 అణాలు ఒక్క రూపాయితో సమానం.
బ్రిటిష్ కాలం నాటి రూ.100 నోటు..
బిటిష్ పాలనలో చిట్టచివరి పాలకుడైన కింగ్ జార్జ్ హయాంలో చలామణిలో ఉన్న వంద రూపాయల నోటు ఇది. ఈ నోట్లను లండన్లో ముద్రించేవారు.
బ్రిటిష్ కాలం నాటి రూ.10 నోటు..
బ్రిటిష్ పాలనలో 1855 సంవత్సర కాలంలో చలామణిలో ఉన్న 10 రూపాయల నోటు ఇది. బ్యాంక్ ఆఫ్ బెంగాల్ పేరుతో ఈ నోటును ముద్రించి అప్పట్లో చలామణి చేశారు.