సిటీబ్యూరో, జూలై 30(నమస్తే తెలంగాణ) : ఎరువుల వినియోగాన్ని క్రమంగా తగ్గించి, మెరుగైన దిగుబడిని పొందడమే లక్ష్యంగా ఇక్రిసాట్ డెవలప్ చేసిన ఎరువుల విధానం రైతులకు ప్రయోజనం కల్గించనుంది. మైక్రోడోసింగ్ పేరిట డెవలప్ చేసిన ఈ పద్ధతిలో తక్కువ పరిమాణంలో రసాయనిక ఎరువులను వినియోగించి భూసారం పెంచడంతోపాటు, సరైన సమయానికి, మోతాదుకు మించకుండా మొక్కకు ఎరువులను అందించడమే పరిశోధకులు చెబుతున్నారు. ఎరువుల అధిక వినియోగంతో ఖర్చుల భారం పెరగడం, తగ్గుతున్న భూసారం, ఆశించిన దిగుబడి రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తక్కువ మోతాదులో మొక్కకు అవసరమైన ఎరువులను అందించడం వల్ల అధిక ఎరువుల వినియోగం తగ్గడంతో పాటు, పరిమితమైన ఎరువులతో మైక్రో డోసింగ్ విధానాన్ని సాగు చేస్తున్న పంట, నేల స్వరూపానికి అనుగుణంగా ఉంటుందన్నారు.
డీఏపీ, ఎన్పీకేను 2 నుంచి 6గ్రాముల మోతాదులో వాటర్ బాటిల్ క్యాప్ పరిమాణంలో మాత్రమే వాడుకోవటమే ఈ పద్ధతి ముఖ్య ఉద్దేశమని, కాగా ఈ విధానంలో దేశ వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు వస్తున్నాయని ఇక్రిసాట్ స్పష్టం చేసింది. సంప్రదాయ పద్ధతుల్లో ఎరువులు వేసినప్పుడు వృథాకు అవకాశం ఉంటుందని, అదే మైక్రో డోసింగ్ విధానంలో అయితే నేరుగా మొక్కకు పోషకాలు చేరడంతోపాటు అధికంగా ఎరువులను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదని తెలిపారు. ఈ విధానం అంతర్జాతీయ స్థాయిలో అమల్లోకి తీసుకొస్తే మరింత ప్రయోజనం ఉంటుందని ఇక్రిసాట్ భావిస్తోంది.