ఖైరతాబాద్, మే 26: వైద్య విద్యార్థినిని వేధింపులకు గురి చేస్తున్న ఘటనలో ఓ యువకుడిపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం… రహమత్నగర్లో నివసించే వైద్య విద్యార్థిని (22)కి రెండేండ్ల కిందట ఇన్స్టాగ్రాంలో నంద్యాలకు చెందిన విల్సన్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి ఫొటోలు సైతం దిగారు.
కొద్ది నెలల కిందట విల్సన్ ఆ ఫొటోలతో ఆమెను వేధించసాగాడు. దీంతో ఆమె కర్నూల్ జిల్లాలోని ఓ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విల్సన్ ఫోన్లో ఉన్న ఆమె ఫొటోలను పోలీసులు డిలీట్ చేయించారు. తాజాగా మరోసారి ఫొటోలను బాధితురాలి తండ్రికి పంపించి వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె షీటీమ్స్ను ఆశ్రయించింది. వారి పర్యవేక్షణలో జూబ్లీహిల్స్ పోలీసులను సంప్రదించగా, కేసు దర్యాప్తు చేస్తున్నారు.