చాంద్రాయణగుట్ట, మే 3 : నిశ్చితార్థం అయిన రెండు రోజులకే ఓ మహిళా కానిస్టేబుల్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ జి.కిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం జైతారం గ్రామానికి చెందిన డి.పర్వతాలు కూతురు డి.సురేఖ (28), 2018 బ్యాచ్ కానిస్టేబుల్. ప్రస్తుతం అలియాబాద్ కల్వగడ్డ బస్తీలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటూ ఛత్రినాక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నది. ఈ నెల 1వ తేదీన పెద్దల సమక్షంలో జైతారం గ్రామంలో తల్లిదండ్రులు సురేఖకు పెళ్లి చేయడానికి బంధువుల అబ్బాయితో నిశ్చితార్థం చేశారు. 2వ తేదీన తిరిగి నగరానికి వచ్చారు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు ఎవరి పనులపై వారు బయటకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సురేఖ ఉదయం 11 గంటల సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఇదిలాఉండగా సురేఖకు గత ఏడాది ఓ అబ్బాయితో పెళ్లి సంబంధం కుదిరినప్పటికీ అప్పట్లో ఇద్దరి జాతకాలు సరిపోవడం లేదని విరమించుకున్నారు. అయితే ఈ సారి కూడా జాతకాలు కలవడం లేదని తెలుసుకున్న సురేఖ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తున్నది. ఈ మేరకు శాలిబండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.