ఖైరతాబాద్, జూలై 26: తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజ్యాధికారం వచ్చింది కాని.., ఇంకా న్యాయాధికారం రాలేదని, హైకోర్టులో ఇంకా సీమాంధ్ర పెత్తనం కొనసాగుతున్నదని ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లింగంనారాయణతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర హైకోర్టులో 24గా ఉన్న న్యాయమూర్తుల సంఖ్యను కేంద్రం 42కు పెంచిందని, కాని పెంచిన న్యాయమూర్తుల నియామకాల్లో ఆంధ్రామూలాలున్న వారిని నియమించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇటీవల కేంద్రానికి పంపించిన 27మంది సీనియార్టీ జాబితాలో 13మంది ఆంధ్రా న్యాయవాదులకు అవకాశం ఇచ్చారని, దీంతో మరోసారి తెలంగాణ న్యాయవాదులకు అన్యాయం జరుగుతుందన్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామన్నారు. సమావేశంలో ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పశుపతి ఈశ్వరనాథ్, నాగేశ్వర్రావు, ఉపాధ్యక్షుడు బి.రఘునందన్ రావు, కార్యవర్గ సభ్యులు కిశోర్కుమార్ తదితరులు పాల్గొన్నారు.