మియాపూర్ , జూన్ 19: మద్యానికి బానిసై.. నిత్యం అశ్లీల చిత్రాలు చూస్తూ.. తన కామవాంఛ తీర్చుకునేందుకు ఏకంగా కన్న కూతురిపైనే కన్నేశాడు. వావి వరసలు మరిచి.. తన వాంఛను తీర్చమని కోరడమే కాకుండా.. కాదన్నందుకు ఏకంగా సొంత కూతురునే అతి కిరాతకంగా హత్య చేశాడా తండ్రి. ఆపై ఏమీ ఎరగనట్లు తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులను తప్పుదోవ పట్టించేలా ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
నివాస ప్రాంతంలోని చెట్ల పొదల్లో కుళ్లిన స్థితిలో ఉన్న ఓ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి.. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోరిక తీర్చనందుకు కన్న తండ్రే కూతురిని హత్య చేసినట్లు వెల్లడైంది. ఈ ఘటన మియాపూర్ ఠాణా పరిధిలో జరిగింది. మియాపూర్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ దుర్గా రామలింగ ప్రసాద్, ఎస్ఐ రాజుతో కలిసి మియాపూర్ ఏసీపీ నర్సింహారావు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
మియాపూర్కు చెందిన బానోత్ నరేశ్ (35) ఈ నెల 7న తన 13 ఏండ్ల కూతురు అదృశ్యమైనట్లు మియాపూర్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. 13న నడిగడ్డ తండా సమీపంలోని చెట్ల పొదల్లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఆనవాళ్ల ప్రకారం తప్పిపోయిన బాలిక (13)గా కుటుంబ సభ్యులు గుర్తించారు. హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయి విచారణతో పాటు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. బాలిక తండ్రి నరేశ్ తన 13 ఏండ్ల కూతురును వంట చెరుకు తీసుకువద్దామంటూ చెప్పి తన ద్విచక్ర వాహనంపై నడిగడ్డ తండా సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లినట్లు గుర్తించారు.
అక్కడ తన కామ వాంఛను కూతురుకు చెప్పడంతో వ్యతిరేకించి బిగ్గరగా అరిచింది. తన దురాలోచన గురించి కూతురు అందరికీ చెబుతుందన్న భయంతో జుట్టు పట్టి నేలకేసి కొట్టాడు. ముక్కులో నుంచి రక్తం కారుతూ అపస్మారక స్థితిలో పడిపోయింది. ఆ తర్వాత పక్కనే ఉన్న బండరాయితో తలపై కొట్టడంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం తన ద్విచక్రవాహనంపై కొంత దూరం వెళ్లిన నిందితుడు నరేశ్.. కూతురు మరణించిన విషయాన్ని ధ్రువీకరించుకునేందుకు మరోసారి ఘటనా స్థలానికి వెళ్లి నిర్ధారించుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన నిందితుడు నరేశ్.. కూతురు కనిపించడం లేదంటూ భార్యకు చెప్పి.. మియాపూర్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. తండ్రే నిందితుడిగా తేల్చారు. ఈ మేరకు నిందితుడు నరేశ్ను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించాడు.