శేరిలింగంపల్లి, మార్చి 14: వట్టినాగులపల్లి ఔటర్ రింగు రోడ్డుపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ పూర్తిగా ధ్వంసం కాగా.. చనిపోయిన లారీ డ్రైవర్ మృతదేహాన్ని పోలీసులు క్రేన్ సాయంతో బయటకు తీశారు. గచ్చిబౌలి పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడుకు చెందిన ఎ.ప్రభు (35), మత్తియలగన్ (36)డ్రైవర్లు. ఉత్తరప్రదేశ్ నుంచి కేరళ రాష్ర్టానికి గ్లాస్ డెలివరీ చేసేందుకు లారీ లోడ్తో ఈనెల 10న బయలుదేరారు. ఈ క్రమం లో గురువారం తెల్లవారుజామున ఔటర్రింగు రోడ్డు మీదుగా వెళ్తున్నారు.
ప్రభు లారీ డ్రైవింగ్ చేస్తుండగా.. మరో డ్రైవర్ మత్తియలగన్ క్యాబిన్లో నిద్రిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. అదే సమయంలో సుల్తాన్పూర్ నుంచి కోకాపేటకు డస్ట్ లోడుతో వెళ్తున్న టిప్పర్ వాహనం ఔటర్ రింగు రోడ్డు వట్టి నాగులపల్లి సబ్స్టేషన్ సమీపంలోకి వెళ్తుండగా.. టైర్ పేలడంతో రహదారి మధ్యలో ఆగిపోయింది. ఔటర్ రింగు రోడ్డు మొబైల్ టీమ్ సైతం అక్కడికి చేరుకుని.. టిప్పర్ను రహదారి పైనుంచి తీసేందుకు క్రేన్కు సమాచారమిచ్చారు. రోడ్డు మధ్యలో నిలిచిపోయిన టిప్పర్ను గమనించని లారీ డ్రైవర్ ప్రభు.. వేగంగా వచ్చి వెనుక నుంచి టిప్పర్ను ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో గ్లాస్ లోడ్తో ఉన్న లారీ క్యాబిన్ తుక్కుతుక్కు కాగా.. లారీ నడుపుతున్న ప్రభు తీవ్ర గాయాలతో లారీ శిథిలాల్లో ఇరుక్కుపోయాడు. క్యాబిన్లో నిద్రపోతున్న మత్తియలగన్ ప్రమాద సమయంలో క్యాబిన్ నుంచి ఎగిరి రహదారిపై పడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో క్యాబిన్లో చిక్కుకుపోయిన ప్రభు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.