తక్కువ కిరాయికే వ్యవసాయ పరికరాలు
కందుకూరు మండలంలో సీహెచ్సీ ఏర్పాటు
రూ.22లక్షలతో యంత్రాల కొనుగోలు
మహిళా సంఘాలకు నిర్వహణ బాధ్యత
కందుకూరు మే 29 : వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు ప్రభుత్వం వేగవంతంగా చర్యలు చేపట్టింది. చిన్న, సన్న కారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పరికరాలను అద్దెకు ఇచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కస్టమ్ హైరింగ్ సెంటర్ పేరుతో పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వం ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద కందుకూరు మండలాన్ని ఎంపిక చేసింది. రూ.22లక్షలతో యంత్రాల పరికరాలను కొనుగోలు చేసింది. గ్రామాల్లో ఉన్న మహిళా పొదుపు సంఘాల ద్వారా చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ యంత్రాలను అద్దెకు ఇస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ బయట కంటే తక్కువ అద్దెకు రైతులకు వ్యవసాయ యంత్రాల పరికరాలను అందజేస్తున్నారు.
వ్యవసాయంలో ఆధునిక యంత్రాల వినియోగం పెరిగిన విషయం తెలిసిందే. కూలీలు కూడా దొరకకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సన్న, చిన్నకారు రైతులు లక్షలు వెచ్చించి యంత్రాలను కొనుగోలు చేసే స్తోమత లేకపోవడంతో పెద్ద రైతులను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులకు మేలు చేసేందుకు కస్టమ్ హైరింగ్ సెంటర్ పేరుతో నూతన పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మహిళా సంఘాల ద్వారా స్థానిక రైతులకు తక్కువ అద్దెకు వ్యవసాయ ఉపకరణాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ప్రభుత్వం మొదట ప్రతి నియోజకవర్గానికి ఒక మండలాన్ని ఎంపిక చేసి అక్కడ రైతులకు వ్యవసాయ యంత్రాల పరికరాలను అందజేయాలని నిర్ణయించింది. తరువాత దశాలవారీగా అన్ని మండలాల్లోని గ్రామాల్లో అద్దెకు వ్యవసాయ పనిముట్లు ఇచ్చే కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. వీటి కొనుగోలు నిర్వహణ బాధ్యత మహిళా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలకు అప్పగిస్తున్నారు. వ్యవసాయ యంత్రాలు పరికరాలు అద్దెకు ఇవ్వడంతో వచ్చే సొమ్ముతో సంఘాలు కూడా ఆర్థికాభివృద్ధి చెందుతాయి.
రైతులకు దోహదపడుతాయి..
రాష్ట్ర ప్రభుత్వం కందుకూరు మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి కస్టమ్ హైరింగ్ సెంటర్ పథకం ద్వారా రూ.22లక్షలను వెచ్చించి వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేసింది. ఈ పథకంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. సన్న, చిన్నకారు రైతులు యాంత్రిక, శాస్త్రీయ పద్ధతుల్లో సాగుచేస్తే అధిక ఉత్పతులు సాధించడానికి దోహదపడుతాయి.
– కవిత, ఏపీఎం కందుకూరు
రైతులకు మేలు
ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుంది. జిల్లాలోనే కందుకూరు మండలాన్ని ఎంపిక చేసి వ్యవసాయ పరికరాలను అద్దెకు ఇవ్వడం సంతోషంగా ఉంది. డ్వాక్రా మహిళలు ప్రభుత్వానికి రుణపడి ఉంటారు. యంత్రాలు కొనుగోలు చేసే స్తామతలేని పేదవారికి అద్దె పరికరాలు ఎంతో ఉపయోగపడుతాయి. డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– సురుసీనా వరలక్ష్మీ సురేందర్రెడ్డి, మార్కెట్ యార్డు చైర్పర్సన్