కందుకూరు : తెలంగాణలో రైతాంగానికి అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indra Reddy) పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగం విషం కక్కుతున్న ప్రతి పక్షాలకు ప్రజలు వాతలు పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. రేవంత్(Revanth Reddy) వ్యాఖ్యలకు నిరసనగా గురువారం మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయానికి 24గంటలు కరెంట్(Power) ఇచ్చి రైతుల కష్టాలు పోగొడితే ప్రతిపక్షాలకు కండ్లు మండుతున్నాయని ఆరోపించారు.
రైతులు సంతోషంగా ఉండడం కాంగ్రెస్కు ఇష్టం లేదన్నారు. బీజేపీ బోర్లకు మీటర్లు బిగిస్తామని అంటుండగా కాంగ్రెస్ నాయకులు మూడు గంటల విద్యుత్ ఇస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను తేవడానికి ప్రయత్నిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామని అంటున్నారని పేర్కొన్నారు.
దేశంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ (CM KCR) పాలనను కోరుకుంటుంటే ప్రతి పక్షాలకు మింగుడు పడడం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీలను నమ్మి మోసపోవద్దని కోరారు. రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్తో తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మారిందని పేర్కొన్నారు.
పంటల ఉత్పత్తులో తెలంగాణ పంజాబ్ను దాటిందని వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ నిరంతరం సీఎం కేసీఆర్ రైతుల మేలు గురించే ఆలోచిస్తారని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఆయచితం శ్రీధర్, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, రైతు విభాగం అధ్యక్షులు క్రిష్ణారాంభూపాల్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.