బంజారాహిల్స్, డిసెంబర్ 2: భార్య నగలను బ్యాంకు నుంచి విడిపించి రెండ్రోజుల్లో డబ్బులు తిరిగి ఇస్తానంటూ నమ్మించి విశ్రాంత చీఫ్ సెక్రటరీని మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.72లోని ప్రశాసన్నగర్లో నివాసముంటున్న విశ్రాంత చీఫ్ సెక్రటరీ వెంకటేశ్వర్లుకు నానక్రామ్గూడకు చెందిన కొండా రవిగౌడ్తో పరిచయం ఉంది.
తన భార్య నగలు బ్యాంకులో తనఖాలో ఉన్నాయని, తన కుమార్తె జన్మదిన వేడుకలకు నగలు ధరించకపోతే బంధువుల్లో పరువు పోతుందంటూ మూడేండ్ల కిందట వెంకటేశ్వర్లును నమ్మించిన రవిగౌడ్ రూ.21లక్షలు తీసుకున్నాడు. తిరిగి బ్యాంకులో నగలు తనఖా పెట్టి మూడు నెలల్లోనే డబ్బులు ఇస్తానంటూ చెప్పిన రవిగౌడ్ తప్పించుకోసాగాడు. దీంతో బాధితుడు వెంకటేశ్వర్లు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై ఐపీసీ 405, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.