హైదరాబాద్ : స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతలు గాంధీజీ పేరును ఉపయోగించుకోవడం దుర్మార్గం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ లోని ఎంజీ రోడ్లో గల గాంధీజీ విగ్రహాన్ని తొలగిస్తున్నారనే తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్ నేతలు రాజకీయ పబ్బం గడుపుకోవాలనే దురుద్దేశంతోనే నేడు ధర్నా చేపట్టడం దురదృష్టకరం అన్నారు.
దేశ స్వాతంత్రం కోసం పోరాడిన గాంధీజీ అంటే మాకు ఎంతో గౌరవం అన్నారు. ఎంజీ రోడ్ లో గల గాంధీ విగ్రహం పరిసరాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడితే.. కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. ప్రస్తుతం ఉన్న గాంధీజీ విగ్రహాన్ని తొలగిస్తారని చేస్తున్న ఆరోపణలు నిరాదారం.
విగ్రహాన్ని ఏర్పాటు చేసిన జస్టిస్ అమర్నాధ్ గౌడ్ కుటుంబ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, అంజయ్య గౌడ్ లను సంప్రదించిన తర్వాతే అభివృద్ధి పనులు చేపట్టాం. ప్రస్తుతం ఉన్న పార్క్ ప్రాంతాన్ని మరింత విస్తరించి 60 లక్షల రూపాయల వ్యయంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. అధికారంలో ఉన్నప్పుడు గాంధీ జయంతి, వర్ధంతులకు మాత్రమే హాజరై గాంధీ పార్క్ అభివృద్ధిని పట్టించుకోని కాంగ్రెస్ నేతలు నేడు గాంధీ పార్క్ అభివృద్ధి జరుగుతుంటే అక్కసుతో నిరాదార విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.