కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 18 : ఫోర్జరీ సంతకాలతో నోటరీ, అఫిడవిట్లను తయారు చేస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేయగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. కేపీహెచ్బీకాలనీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారెడ్డి కాలనీ ఫేజ్-1లో నకిలీ నోటరీ, అఫిడవిట్లను తయారు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఎస్సై రమేశ్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నోటరీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఐదుగురు వ్యక్తులతో పాటు నకిలీ పత్రాలు, రబ్బర్ స్టాంపులు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు.
నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన జూలకంటి రవితేజ (సాయి నోటరీ) సాలూర గ్రామానికి చెందిన సాలూర లక్ష్మణ్రావు (57) (శ్రీలక్ష్మీ ట్యాక్స్ అసోసియేషన్), పుదుచ్ఛేరి రాష్ట్రం యానంకు చెందిన పండాటి అరుణారాణి (43) (వీఎస్ఎల్ సర్వీసెస్), కేపీహెచ్బీ కాలనీ ధర్మారెడ్డి కాలనీకి చెందిన చిత్తూరు శ్రీనివాస్ (45) (లేఖ జిరాక్స్) పేర్లతో నోటరీ కేంద్రాలు నిర్వహిస్తూ.. ఫోర్జరీ పత్రాలు రూపొందిస్తున్నారు. వీరికి సాయం చేస్తున్న గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన దుంపల మురళీకృష్ణ (31) న్యాయ విద్యార్థులతో పాటు నిజాంపేట గ్రీన్ ఎవెన్యూలో నివాసముంటున్న కొండూరి సునీల్ (50) నోటరీ అడ్వకేట్పై కేసు నమోదు చేయగా, ఐదుగురిని రిమాండ్కు తరలించారు.
సునీల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 10 రబ్బరు నోటరీ స్టాంపులు, 3 ల్యాప్టాప్లు, 4 మొబైల్లు, సంతకాలు చేసిన ఖాళీ కాగితాలు 15, వంద రూపాయల బాండు పేపర్లు 4, నకిలీ పత్రాలు 12 స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నోటరీ అడ్వకేట్ల ప్రోత్సాహంతో ఫోర్జరీ పత్రాలను తయారు చేస్తున్న ఇలాంటి కేంద్రాలపై మరింత దర్యాప్తు చేస్తున్నామన్నారు.