సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): రుణయాప్ల కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీజ్ చేసిన నగదు ఖాతాలను సైబర్నేరగాళ్లు మళ్లీ తెరిపించి నగదును కొట్టేస్తున్నారు. ఇందుకు బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం కూడా తోడవుతున్నది. సైబర్ నేరగాళ్లు వేసిన ఎత్తులో కోల్కతాలో సఫలమయ్యారు.. అదేరీతిగా గురుగావ్లోని 61 ఖాతాలకు ఎసరు పెట్టాలని ప్రయత్నించడంతో విఫలమయ్యారు. రుణయాప్ల కేసుల్లో హైదరాబాద్ సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు దర్యాప్తును పూర్తిచేస్తూ ఒకోక కేసులో చార్జిషీట్ దాఖలు చేస్తున్నారు.
మొదటి చార్జిషీట్ను గత వారం పోలీసులు కోర్టుకు సమర్పించారు. 197 రుణ యాప్లకు సంబంధించి 157 కంపెనీలపై 27 కేసులు నమోదుచేసిన పోలీసులు 26 మందిని అరెస్ట్ చేశారు, అందులో ఇద్దరు చైనీయులు కూడా ఉన్నారు. ఆర్థిక పరమైన లావాదేవీలకు సంబంధించి సుమారు 1100 ఖాతాల్లోని రూ. 400 కోట్లను ఫ్రీజ్ చేశారు. ఈ ఖాతాల్లో ప్రధానంగా కోటి రూపాయలకు పైగా ఆర్థిక పరమైన లావాదేవీలు జరిపినవి దాదాపు వంద ఖాతాల వరకు ఉంటాయి. మిగితా వాటిల్లో తక్కువ మొత్తంలో లావాదేవీలు జరిగాయి. ఫ్రీజ్ చేసిన ఖాతాలకు సంబంధించిన కొన్ని సంస్థలు తమ వద్ద ఉన్న అనుమతి పత్రాలను పోలీసులకు సమర్పించారు.
అనుమతితో చేస్తున్న వ్యాపారానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులకు ఇవ్వడంతో నిబంధనల మేరుకు రుణ యాప్లు నిర్వహించే కంపెనీలకు సంబంధించిన ఖాతాలు డీ ఫ్రీజ్ అయ్యాయి. దీనిని అసరాగా చేసుకున్న రుణయాప్లకు సంబంధించిన సైబర్ నేరగాళ్లు తమ ఖాతాలను డీ ఫ్రీజ్ చేసేందుకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు సంబంధించిన నకిలీ లెటర్లతో ఎత్తులు వేశారు. సీసీఎస్ పోలీసుల ఫ్రీజ్ చేసిన ఖాతాల్లో మూడు ఖాతాలు కోల్కత్తలో ఉన్నాయి.
నకిలీ పత్రాలతో రెండు ఖాతాలను డీ ఫ్రీజ్ చేసిన నేరగాళ్లు రూ.1.18 కోట్ల మొత్తాన్ని తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. మిగితా 35 ఖాతాలు గురుగావ్లోని బ్యాంకులో ఉన్నాయి. నేరగాళ్లు మరికొన్ని ఖాతాలను డీ ఫ్రీజ్ చేసుకునేందుకు సీసీఎస్ పేరుతో తయారు చేసిన నకిలీ పత్రాలను ఆయా బ్యాంకులను పంపించారు. ఈ విషయాన్ని గురుగావ్లోని ఐసీఐసీఐ బ్యాంకు అధికారులు సిటీ సైబర్క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు.జ దీంతో సైబర్ నేరగాళ్ల బండారం బయటపడింది.
లోన్యాప్ల కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాలను నకిలీ పోలీసులు డీఫ్రీజ్ చేయించిన ఘటనలో హైదరాబాద్ బేగంపేట్కు చెందిన ఓ వ్యక్తిని గురువారం అరెస్ట్ చేశారు. జాయింట్ సీపీ అవినాష్ మహంతి కథనం ప్రకారం.. గచ్చిబౌలిలోని ఐసీఐసీఐ రీజినల్ మేనేజర్ సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మే 8వ తేదీన హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు లోన్యాప్ల కేసులో ప్రీజ్ చేసిన హానీజ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఐసీఐసీఐ బ్యాంకులో ఉన్న ఖాతా 388805000474ను డీ ఫ్రీజ్ చేయించి, అందులో ఉన్న రూ.90 లక్షల నగదును హైదరాబాద్లోని ఆనంద్ జన్ను అనే వ్యక్తికి చెందిన ఎస్బీఐ ఖాతాకు బదిలీ చేశారు. అలాగే మే 13వ తేదీన కోల్కత్త ఎయిల్పోర్, గురుగావ్లోని ఐసీఐసీఐ బ్యాంకులకు లోన్ యాప్ల కేసులో ఫ్రీజ్ చేసిన ఖాతాలను డీఫ్రీజ్ చేయాలంటూ హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసుల పేరుతో నకిలీ లెటర్లు వచ్చాయనే వివరాలను పోలీసులకు చెప్పారు. దీంతో కేసు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బేగంపేట్లోని ఎస్బీఐ బ్యాంకు ఖాతాలో ఉన్న ఆనంద్ జన్ను ఖాతాలోకి రూ. 1.18 కోట్లు జమ అయినట్లు గుర్తించారు. అవి కూడా పోలీసులు ఫ్రీజ్ చేసిన ఖాతాలను, దొడ్దిదారిన డీఫ్రీజ్ చేయించి ఆ నగదును ఆనంద్ జన్ను ఖాతాలోకి మళ్లించినట్లు నిర్ధారించి గురువారం ఆనంద్ జన్నును అరెస్ట్ చేశారు.