సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి నకిలీ ఉద్యోగులను సృష్టించి.. వారి పేర్లతో రెండేండ్లుగా రూ. 2 కోట్లు స్వాహా చేశాడు. సదరు మేనేజర్ ఉద్యోగం నుంచి వెళ్లిపోయిన తరువాత విషయం వెలుగులోకి రావడంతో యాజమాన్యం శుక్రవారం సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏసీపీ కేవీఎం ప్రసాద్ కథనం ప్రకారం.. హబ్సిగూడలో యాప్ అప్లికేషన్ పేరుతో కొనసాగుతున్న సాఫ్ట్వేర్ కంపెనీలో నిందితుడు కొన్నేళ్లు మేనేజర్గా పనిచేశాడు. సంస్థలో పనిచేస్తున్న వారితో పాటు రికార్డుల్లో కొన్ని బినామీ పేర్లు కూడా చేర్చాడు. ఉద్యోగుల వెరిఫికేషన్ చేసేది మేనేజరే కావడంతో వారందరికీ జీతాలిచ్చినట్లు లెక్కలు చూపుతున్నాడు. ఇతడికి అకౌంట్ సెక్షన్లో పనిచేసే ఓ ఉద్యోగి కూడా సహకరించాడు. మేనేజర్ భార్య పేరును కూడా నకిలీ ఉద్యోగుల్లో చేర్పించగా, ఆమె అకౌంట్కు మొత్తం రూ. 50 లక్షలు జమ కావడం గమనార్హం. యజమాన్యం లెక్కలు పరిశీలించి.. సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు.