నమ్మిన వారిని మోసం చేయడం తేలిక అని గ్రహించింది ఓ అంతర్రాష్ట్ర ముఠా. ‘బంగారం’ లాంటి మోసం చేసేందుకు సిద్ధపడ్డారు. తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. ఇది చూసిన నగర వాసి అగ్గువకే కేజీ బంగారం వస్తుందంటూ ఆశపడి వారితో రహస్యంగా డీల్ కుదుర్చుకున్నాడు. అడ్డాకు రమ్మన్నాడు.. అడ్డంగా బుక్కయ్యాడు. రూ.38.5 పోగొట్టుకుని నోరెళ్లబెట్టాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ముఠాను పట్టుకుని కటకటాల్లోకి పంపారు.
సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : తక్కువ ధరకు బంగారం అమ్ముతామంటూ సోషల్మీడియాలో ప్రచారం చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి రూ.20 లక్షల నగదును రికవరీ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ బుధవారం మీడియాకు వివరించారు. గత నెల 25వ తేదీన ల్యాబ్టెక్నీషియన్ అయిన మహ్మద్ అబ్దుల్ అఫ్రోజ్కు కిలో బంగారం రూ.42 లక్షలకు ఇస్తామంటూ నమ్మించిన ఓ ముఠా అతడి దృష్టి మళ్లించి రూ.38.5 లక్షలున్న బ్యాగ్ను తీసుకొని పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కాచిగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
డబ్బు, బంగారం మార్పిడి ఒకేసారి జరగాలి. ఈ ప్రోటోకాల్ తప్పని సరిగ్గా పాటించాలని బాధితుడికి సూచించారు. డబ్బు సిద్ధం కాగానే కలుద్దామంటూ మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే గత నెల 25వ తేదీన ప్రోటోకాల్ ప్రకారం డబ్బు, బంగారం మార్పిడి చేసుకుందామని తాను బిజీగా ఉండటంతో రాలేకపోతున్నానని, అయితే పాండురంగారావు, అన్వేశ్లు వస్తున్నారంటూ ముఖేశ్ బాధితుడికి ఫోన్ చేసి చెప్పాడు. ఈ క్రమంలోనే బాధితుడిని కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద, పాండు, అన్వేశ్లు కలిసి అక్కడి నుంచి నింబోలిఅడ్డాలోని బాధితుడి ఫ్లాట్కు వెళ్లారు.
అక్కడ మీరు డబ్బు అంతా మాకు చూపించి, సూట్కేసులో పెట్టి లాక్ వేయాలి, మేం వెళ్లి బంగారం తీసుకొని వస్తాం, ఆ తరువాత మార్పిడి చేసుకుందామంటూ మాట్లాడుకున్నారు. బాధితుడు రూ. 42 లక్షలు తీసుకొని వాళ్లు ఇచ్చిన రెక్సిన్ బ్యాగ్లో పెట్టి దానికి తాళం వేసి సూట్కేసులో పెట్టాడు. సూట్కేసులో రూ.38.5 లక్షలే పట్టడంతో మిగతా డబ్బు బాధితుడికి డిస్కౌంట్ అంటూ ఇచ్చేశారు. కొద్దిసేపటి తరువాత బంగారం రావడానికి ఆలస్యమయ్యేలా ఉందని, మీ డబ్బు మీరు తీసుకోండి అంటూ సూట్కేసులో నుంచి డబ్బులు పెట్టిన రెక్సిన్ బ్యాగ్ తీసి బాధితుడికి ఇచ్చేశారు.
డబ్బులు ఇచ్చే సమయంలో బాధితుడి దృష్టి మళ్లించే విధంగా ప్రత్యేకమైన సూట్కేసును విజయవాడలో చేయించారు. అందులో ఒకే రకమైన రెండు బ్యాగ్లు పెట్టి, రెండు వైపులా సూట్కేసును తెరిచేలా తయారు చేయించారు. ముందుగా ఒక రెక్సిన్ బ్యాగ్లో నకిలీ కరెన్సీ పెట్టి ఆ బ్యాగ్కు తాళం వేసి దాన్ని సూట్కేసులో పెట్టి దొంగల ముఠా అక్కడకు వచ్చింది. ఆ తరువాత అలాంటి బ్యాగ్లోనే బాధితుడి వద్ద నుంచి అసలైన నోట్ల కట్టలు బ్యాగ్లో పెట్టించారు. కొద్దిసేపటి తరువాత బంగారం ఆలస్యమవుతుందంటూ చెప్పి బాధితుడికి అందులో నకిలీ నోట్లను పెట్టిన బ్యాగ్ను తిరిగి ఇచ్చేశారు. అయితే ఇక్కడ బాధితుడికి అనుమానం రాకుండా సూట్కేసును ఉల్టాపల్టా( కింద ఉన్నవి పైకి వచ్చేట్లు) చేసి నకిలీ కరెన్సీ బ్యాగ్ను ఇచ్చేశారు.
తాళం తీస్తే మళ్లీ డబ్బులు లెక్కించాల్సి వస్తుంది, మేం కొద్దిసేపట్లో వస్తాం అప్పుడు తాళం వేసిన బ్యాగ్ను అలాగే తీసుకుంటామంటూ నమ్మించి అక్కడి నుంచి పరారయ్యారు. ఎంతకీ పోయిన వారు రాకపోవడంతో అనుమానం వచ్చి బాధితుడు బ్యాగ్లో చూస్తే బొమ్మ కరెన్సీ కట్టలు ఉన్నాయి. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జాయింట్ సీపీ ఎం.రమేశ్ నేతృత్వంలో అదనపు డీసీపీ మురళీధర్ పర్యవేక్షణలో కాచిగూడ ఇన్స్పెక్టర్ బృందం దొంగలను పట్టుకుంది. రైలులో మరో బాధితుడిని మోసం చేసే ప్రయత్నం చేస్తున్న ముఠాలో ఆరు మందిని పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.20 లక్షల నగదు, నకిలీ కరెన్సీ, రెక్సిన్ బ్యాగ్స్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు బృందంలో ఉన్న ఎస్సై లక్ష్మణ్ను సీపీ ప్రత్యేకంగా అభినందించారు.
కర్ణాటక రాష్ర్టానికి చెందిన మహ్మద్ రఫీక్ ఇబ్రహీం కల్బుర్గి అలియాస్ రెడ్డి, మహారాష్ట్రకు చెందిన బింగి శ్రీనివాస్ అలియాస్ ముఖేశ్, ఆంధ్రప్రదేశ్ వెస్ట్గోదావరి జిల్లాకు చెందిన రెడ్డి పాండురంగారావు అలియాస్ గోపాల్రెడ్డి, మంచిర్యాలకు చెందిన మల్రాజా అన్వేష్కుమార్లతో పాటు పరారీలో ఉన్న మరో ఇద్దరు గ్యాంగ్ సభ్యులు. వీళ్లపై కర్ణాటక, ఏపీ, తెలంగాణలో పలు కేసులున్నాయి. ఇందులో కొందరు గతంలో నకిలీ కరెన్సీ, రైస్పుల్లింగ్ తదితర విషయాల్లో పెట్టుబడులు పెట్టి మోసపోయారు. తాము మోసపోయినట్టుగానే ఇతరులను కూడా మోసం చేయాలని ప్లాన్ వేసి ఓ గ్యాంగ్ను ఏర్పాటు చేశారు.
ఇందులో భాగంగా ఢిల్లీకి చెందిన వికాస్ గౌతమ్(పరారీలో ఉన్నాడు) బంగారం తక్కువ ధరకు ఇస్తామంటూ ఫేస్బుక్లో ఓ పోస్టు చేశాడు. దాన్ని చూసిన బాధితుడు అఫ్రోజ్ అందులో ఉన్న నంబర్కు ఫోన్ చేయడంతో బంగారం తక్కువ ధరకు (రూ.42 లక్షలకు కిలో) ఇస్తామంటూ ఒప్పందం చేసుకున్నారు. ముంబైలో ఉన్న తమ భాగస్వామి అమిత్పటేల్(పరారీలో ఉన్నాడు)తో ఫోన్లో మాట్లాడమంటూ అతడి నంబర్ ఇచ్చాడు. అతడితో మాట్లాడటంతో తమ హైదరాబాద్ ఏజెంట్తో మాట్లాడమంటూ రెడ్డి నంబర్ ఇచ్చాడు. ఇలా ఈ ముఠా సభ్యులు ఫోన్లో మాట్లాడిన తరువాత ముఖేశ్, అన్వేష్లు బాధితుడితో కలిసి బంగారం బిస్కెట్లు చూపించారు.