మెహిదీపట్నం అక్టోబర్ 8: వెండికి బంగారు పూత పూసి..తాకట్టు పెట్టి..డబ్బులు దండుకుంటున్న ముఠాను ఎస్ఆర్నగర్ పోలీసులు పట్టుకున్నారు. పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో జాయింట్ కమిషనర్, డీసీపీ శ్రీనివాస్, పంజాగుట్ట ఏసీపీ గణేశ్, ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులుతో కలిసి వివరాలు వెల్లడించారు. బోరబండ మోతినగర్ కబీర్నగర్లో నివసించే ఈదిగ భాస్కర్(51), గుంటూరుకు చెందిన బొబ్బ వెంకట్రెడ్డి(59), యూసుఫ్గూడలో ఉంటున్న కడప జిల్లా వాసి హరివర్ధన్(32), రాజేందర్కుమార్ ముఠాగా ఏర్పడ్డారు.
వీరిలో భాస్కర్, వెంకట్రెడ్డి గతంలో జైలుకు వెళ్లివచ్చారు. భాస్కర్ సూచనలతో హరివర్ధన్, రాజేందర్కుమార్ వెండి ఉంగరాలకు బంగారం తాపడం చేసి ఇచ్చేవారు. వీటిని వెంకట్రెడ్డి దుకాణాల్లో తాకట్టు పెట్టి.. డబ్బులు తెచ్చి..జల్సాలు చేసేవారు. ఒకే దుకాణంలో మూడు సార్లు ఉంగరాలు తాకట్టు పెట్టడం, వాటిని విడిపించుకోకపోవడంతో అనుమానం వచ్చిన బోరబండ రామారావునగర్లోని షాపు యజమాని గణేశ్ ఉంగరాలను పరీక్షించాడు. నకిలీ బంగారం అని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన ఎస్ఆర్నగర్ పోలీసులు ముగ్గురిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. విచారణలో ఈ ముఠా సుమారు 200 దుకాణాల్లో వెండి పూతతో తయారు చేసిన ఉంగరాలను తాకట్టు పెట్టి లక్షలను కొల్లగొట్టిందని తేలింది.