సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): తిరుపతి జిల్లా డిప్యూటీ ఎస్పీనంటూ నకిలీ అధికారి అవతారమె త్తి, బోగస్ కంపెనీల్లో పెట్టుబడుల పేరిట అధిక లాభాలు ఇప్పిస్తామని నమ్మించి అమాయకులను నట్టేట ముంచిన ఓ ముఠా సభ్యుడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితుడిని ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన కొండూరు రెడ్డి వెంకట్ రాజు అలియాస్ కేవీపీ రాజు అలియాస్ డీఎస్పీ రాజుగా పోలీసులు గుర్తించారు. పోలీసు కథనం ప్రకారం.. కేవీపీ రాజు అతని ముఠా సభ్యులు తాము సీనియర్ పోలీసు అధికారులమని ప్రచారం చేసుకుంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని అనేక మంది అమాయకులను లక్ష్యంగా చేసుకున్నారు.
ఉనికిలో లేని కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెడితే స్వల్పకాలంలోనే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. బాధితులకు నమ్మకం కలిగించేందుకు సెక్యూరిటీ పేరిట నకిలీ ఆస్తి పత్రాలు, పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చా రు. సమయానికి డబ్బు లు తిరిగి ఇవ్వకుండా, బాధితులు నిలదీస్తే తాము ఎన్కౌంటర్ స్పెషలిస్టులమని బెదిరింపులకు దిగేవారని సీసీఎస్ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఒకరి నుంచి రూ.1.20 కోట్లు వసూలు చేసి మోసం చేయడంతో బాధితుడి ఫిర్యా దు మేరకు సీసీఎస్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు.
నిందితుడు కేవీపీ రాజుపై మరో మూడు క్రిమినల్ కేసులు గతంలోనే నమోదై ఉన్నాయని, ఇవి తిరుపతి సీసీఎస్, తుకారాంగేట్ పీఎస్, నెల్లూరు జిల్లా వేదాయపాళెంలో నమోదైనట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ సీసీఎస్ డీసీపీ ఆధ్వర్యంలో ఈవోడబ్ల్యూ టీమ్ ఏసీపీ కిరణ్ పర్యవేక్షణలో ఎస్ఐ జి.అనిల్కుమార్ సిబ్బంది నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. నిందితుడు రాజు 2021 నుంచి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.