సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు బ్యాంకుకు సంబంధించిన వేలం పాటలో కొనుగోలు చేసిన ఇంటిని నకిలీ పత్రాలతో మరొకరికి విక్రయించారు. ఈ వ్యవహారంలో నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసిన నేరంపై దూద్బౌలి మాజీ సబ్ రిజిస్ట్రార్తో పాటు మరో 10 మందిపై సీసీఎస్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. స్నేహాల్ ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులైన శ్రీనివాసమూర్తి, వీరేశమూర్తి అఫ్జల్గంజ్లోని 272 గజాల భవనాన్ని 2000లో చార్మినార్ బ్యాంకులో తనఖా పెట్టి రూ. 2.3 కోట్ల రుణం తీసుకున్నారు. రుణం తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ఆ భవనాన్ని 2018లో బహిరంగ వేలం వేయగా, పత్తర్ఘట్టికి చెందిన అమీరుద్దీన్ రూ. 2.37 కోట్లకు కొనుగోలు చేశాడు. ధర ఫైనల్ కావడంతో వేలంలో భవనాన్ని దక్కించుకున్నట్లుగా బ్యాంక్ అధికారులు అమీరుద్దీన్కు అధికారిక లేఖ ఇచ్చి, రూ. 6.27 లక్షల ఈఎండీ చార్జీలు తీసుకున్నారు. ఆ తరువాత ఈ ఆస్తికి సంబంధించిన ఈసీని బాధితుడు తీసుకోవడంతో 2003లో కెనరా బ్యాంకులో మార్ట్గేజ్ చేసినట్లు రికార్డుల్లో ఉంది. ఈ విషయాన్ని అమీరుద్దీన్ చార్మినార్ బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అధికారులు సైతం వేలం వేసిన ఈ భవనాన్ని ఎవరికీ రిజిస్ట్రేషన్ చేయవద్దంటూ.. దూద్బౌలిలోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ముందస్తుగా దరఖాస్తు చేశారు. ఇదిలాఉండగా కెనరా బ్యాంకులో పెండింగ్లో ఉన్న రుణాన్ని చెల్లించిన శ్రీనివాసమూర్తి, వీరేశమూర్తి తదితరులు అక్కడ మార్ట్గేజ్లో ఉన్న డాక్యుమెంట్లను రిలీజ్ చేసుకున్నారు. ఆ తరువాత ఆ ఇంటి నంబర్ను మార్చి, దూద్బౌలి సబ్రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రెండు ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించి.. ఇతరులకు విక్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తు జరిపి కేసు నమోదు చేశారు. సబ్రిజిస్ట్రార్ సురేశ్, చార్మినార్ బ్యాంకు లిక్విడేటర్గా వ్యవహరించిన అన్నపూర్ణ, కెనరా బ్యాంకు సికింద్రాబాద్ ఏఆర్ఎం బ్రాంచ్ మేనేజర్ ఫరీదాలతో పాటు ప్రధాన సూత్రధారులైన స్నేహాల్ ఎంటర్ప్రైజెస్, ఆ సంస్థ నిర్వాహకులు కె. శ్రీనివాసమూర్తి, కె.వీరేశమూర్తి, కె. రమేశ్మూర్తి, సునీత, అనురాధ, రాజ్కుమార్, రాజ్యలక్ష్మి, రితేశ్కుమార్లను నిందితులుగా చేర్చుతూ.. కేసు నమోదు చేశారు.