దుండిగల్, ఫిబ్రవరి 14: పదో తరగతి పాస్ కాలేదు.. కానీ..ఏకంగా డాక్టర్గా చెలామణి అవుతూ…ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఓ నకిలీ వైద్యురాలి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రతినిధుల బృందం శుక్రవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెండు క్లినిక్లు, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, మల్లంపేటలోని నాలుగు క్లినిక్ లపై దాడులు నిర్వహించింది. ప్రైవేట్ ప్రాక్టీస్ పేరుతో కొందరు ఎటువంటి అర్హతలు లేకుండానే వైద్యశాలలు నిర్వహిస్తున్నట్లు గుర్తించింది.
ఎంబీబీఎస్ వంటి డిగ్రీలు లేకుండానే అల్లోపతి వైద్యం నిర్వహిస్తూ, రోగులకు విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, వ్యాక్సిన్సు , పెయిన్ కిల్లర్లు ఇస్తున్నట్లు తేలింది. నిజాంపేటలో బుచ్చిబాబు క్లినిక్ పేరుతో అరుణ కుమారి అనే నకిలీ వైద్యురాలు ఏకంగా మహిళలకు అబార్షన్లు చేస్తున్నట్లు గుర్తించారు. ఆమె కనీసం టెన్త్ క్లాస్ కూడా పాస్ కాలేదని కమిషన్ సభ్యులు పేర్కొన్నారు. ఇలాంటి వారు అందించే వైద్యంతో రోగులు మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు.
నేషనల్ మెడికల్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నకిలీ వైద్యుల గుర్తింపులో భాగంగా తరచూ ఇటువంటి తనిఖీలు చేపడుతున్నామని, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 400కు పైగా నకిలీ వైద్యులను గుర్తించి కేసులు నమోదు చేశామన్నారు. ఒక్క హైదరాబాద్ మహానగర పరిధిలోనే ఇప్పటివరకు 150 పైగా కేసులు నమోదైనట్లు చెప్పారు.
ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ పేరుతో ఎటువంటి అర్హతలు లేకుండా అల్లోపతి వైద్యం అందిస్తున్న వారితో పాటు, ఆయుర్వేద ఇతర వైద్యాశాలలో పేరుతోనూ అల్లోపతి వైద్యం అందించడం నేరమన్నారు. కనీసం పదో తరగతి ,ఇంటర్ కూడా ఉత్తీర్ణులు కానీ వారు అందించే వైద్యంతో ప్రజలకు హాని జరుగుతుంది తప్ప.. ఎటువంటి మేలు జరగదన్నారు .వీరిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా , నిజాంపేటలోని బుచ్చిబాబు క్లినిక్, యష్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ,మల్లంపేటలోని శ్వేతా క్లినిక్, సహజ హాస్పిటల్, జే.జే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లతో పాటు మొత్తం 6 క్లినిక్లలో తనిఖీలు నిర్వహించామని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.