రూ. 1300 ఇస్తే చాలు..
ఒక్కరోజులోనే బర్త్ సర్టిఫికెట్..!
డేటా ఎంట్రీ ఆపరేటర్తో పాటు నలుగురు ఏజెంట్లు అరెస్ట్
పరారీలో హెల్త్ అసిస్టెంట్ ఆఫీసర్
సిటీబ్యూరో, మార్చి 17 : బల్దియాలో నకిలీ బర్త్ సర్టిఫికెట్ల దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టును ఎస్ఆర్నగర్ పోలీసులు రట్టు చేశారు. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్లోని హెల్త్ అసిస్టెంట్ అధికారి, ఆ విభాగంలో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లు ప్రధాన సూత్రధారులుగా ఈ వ్యవహారం నడుస్తున్నట్లు విచారణలో బయటపడింది. వెస్ట్జోన్ డీసీసీ జోయల్ డేవిస్ వివరాలు వెల్లడించారు. ఖైరతాబాద్ సర్కిల్లో ఆకుల సతీష్ కాంట్రాక్టు డేటా ఎంట్రీ ఆపరేటర్గా, ఐజాజ్ ఖాసీం, హెల్త్ అసిస్టెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. వీళ్లిద్దరు ఈజీగా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేసి.. అవసరమున్న వారికి అడిగిన తేదీతో ఒక్క రోజులోనే అడ్డదారిలో బర్త్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు పథకం రూపొందించుకున్నారు. సోమాజిగూడకు చెందిన మహ్మద్ రసూల్, న్యూమలక్పేట్ వాసి సయ్యద్ హుస్సేన్ ఇక్బాల్, మాసబ్ ట్యాంక్కు చెందిన ఆరీఫ్ అహ్మద్, హుమాయిన్నగర్కు చెందిన మహ్మద్ రషీద్లను ఏజెంట్లుగా నియమించుకున్నారు. ఒక్కో సర్టిఫికెట్కు ఏజెంట్లు రూ. 1300 వసూలు చేస్తారు. వాటిలో ఏజెంట్లు రూ. 300 కమీషన్ తీసుకొని, సతీష్కు రూ వెయ్యి అందిస్తే.. ఐజాజ్కు రూ. 750 వాటా పోగా, మిగతాది డేటా ఎంట్రీ ఆపరేటర్ జేబులోకి వెళ్తుంది.
ఇలా చేస్తారు..
ఏజెంట్లు బర్త్ సర్టిఫికెట్ అవసరమైన వారి పేరు, పుట్టిన తేదీ ఆ సర్టిఫికెట్లో ఏముండాలో ఆ వివరాలను వాట్సాప్లో సతీష్కు పంపిస్తారు. అతడు కంప్యూటర్లో ఎంట్రీ చేస్తే.. అవన్ని సరిగ్గా ఉన్నాయని హెల్త్ అసిస్టెంట్ అయిన ఐజాజ్ ఓకే చేయగానే.. అన్ని సవ్యంగా ఉన్నాయని ఏఎంహెచ్వో డిజిటల్ సంతకంతో దానిని అప్రూవల్ చేస్తాడు. ఆ సర్టిఫికెట్ను డేటా ఎంట్రీ ఆపరేటర్ అప్లోడ్ చేస్తాడు. దానిని దరఖాస్తుదారుడు మీసేవా కేంద్రం నుంచి డౌన్లోడ్ చేసుకుంటాడు.
163 దరఖాస్తులు..
ఏజెంట్ల నుంచి 163 దరఖాస్తులు వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఈ సర్టిఫికెట్లు పొందిన వారి వివరాలను కూడా ఆరా తీస్తున్నామని డీసీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. లబ్ధిపొందిన వారు ఏ ప్రయోజనం కోసం వాటిని తీసుకున్నారనే విషయాలు కూడా విచారణలో తేలుతాయన్నారు. ఈ గ్యాంగ్లో జీహెచ్ఎంసీ హెల్త్ అసిస్టెంట్ ఆఫీసర్ ఐజాజ్, ఏజెంట్ అంకిత్ పరారీలో ఉన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ సతీష్ను బుధవారం అరెస్ట్ చేయగా, ఏజెంట్లు మహ్మద్ రసూల్, హుస్సేన్ ఇక్బాల్, ఆరీఫ్ అహ్మద్, మహ్మద్ రషీద్లను గురువారం పట్టుకున్నారు. నిందితుల నుంచి నకిలీ సర్టిఫికెట్లు, ఆరు సెల్ఫోన్లు, రూ. 19,400 నగదును స్వాధీనం చేసుకున్నారు.