GHMC | సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో పారిశుధ్యం, ఎంటమాలజీ విభాగాల్లో అక్రమాలకు శాశ్వత చెక్ పెడుతూ సరికొత్త విధానాన్ని తెరపైకి తెచ్చారు. కార్మికుల అటెండెన్స్లో ప్రస్తుతం అమలవుతున్న ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ హాజరును నేటి నుంచి నిలిపివేయనున్నారు. సోమవారం నుంచి అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టంను అమలు చేయనున్నారు.
ఇందుకు సంబంధించిన యాప్ రూపకల్పన, కార్మికుల రిజిస్ట్రేషన్ చర్యలను దాదాపుగా పూర్తి చేశారు. నకిలీ సింథటిక్ ఫింగర్ ప్రింట్స్ తయారు చేసి.. హాజరు నమోదు చేస్తూ ..అక్రమాలకు తెరలేపారు. శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ (ఎస్ఎఫ్ఏ)ల నుంచి ఉన్నతాధికారుల వరకు ఈ అక్రమాల బాగోతాలకు తెరలేపిన నేపథ్యంలో కమిషనర్.. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలోనే అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఫేషియల్ రికగ్నిషన్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టంను అమలు చేస్తున్నారు. ఇందులోభాగంగానే మొబైల్ ఫోన్తో వినియోగించగలిగే ప్రత్యేక యాప్ను రూపొందించారు.
ఈ యాప్లో కార్మికుల పేర్లు, ఐడీ, ఆధార్ వివరాలు పొందుపర్చారు. ఈ యాప్లో హాజరు తీసుకునే సమయంలో కార్మికులున్న ప్రదేశాన్ని జియో ఫెన్సింగ్తో తెలుసుకునే సౌకర్యం ఉంటుంది. పారిశుధ్యం ఎంటమాలజీ, వెటర్నరీ విభాగాల్లోని దాదాపు 25వేల మంది కార్మికులు, సంబంధిత అధికారుల హాజరును దీని ద్వారానే తీసుకుంటారు. ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్తో విధుల్లో రోజుకు ఎంతమంది హాజరవుతున్నారు? అక్రమంగా జీతాలు విడుదల అవుతున్నాయా? అనేది తెలుసుకునే వీలుంటుంది.