సిటీబ్యూరో, జూన్ 19( నమస్తే తెలంగాణ): అతడి పేరు మహ్మద్ అఖిల్. ఇంజినీరింగ్ విద్యార్థి. కరోనా పరిస్థితులతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండటంతో జొమాటోలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. పేదరికం కారణంగా బైక్ కొనుగోలు చేయలేని పరిస్థితి. సైకిల్ మీదే ఆర్డర్స్ డెలివరీ చేస్తున్నాడు. మూడు కిలోమీటర్ల మేర వచ్చే ఆర్డర్స్ మాత్రమే పొందుతున్నాడు. ఆదాయం నెలకు 7 వేలు దాటడం లేదు. అఖిల్ ఇబ్బందిని తెలుసుకున్న నో ఫుడ్ వేస్ట్ సంస్థ ఫౌండర్ రాబిన్.. ఫేస్బుక్లోని ‘ద గ్రేట్ ఫుడ్ అండ్ ట్రావెల్స్’ పేజీలో అతడు పడుతున్న కష్టాన్ని పోస్టు చేశాడు. వెంటనే స్పందించిన ఆ పేజీలోని 32 వేల మంది సభ్యులు తమకు తోచిన సాయం అందించారు. రూ.73 వేలు జమ అయ్యాయి.
ఆ డబ్బుతో బైక్ కొనుగోలు చేసి అఖిల్కు ఇద్దామని చెప్పడంతో అతడు మైలేజీ దృష్ట్యా టీవీఎస్ ఎక్సెల్ సరిపోతుందని వివరించాడు. దీంతో ఆ వాహనాన్ని రూ.66 వేలతో కొనుగోలు చేసి.. శుక్రవారం అఖిల్కు అందించారు. దీనిపై అఖిల్ స్పందిస్తూ.. ‘ నా కుటుంబాన్ని పోషించేందుకు ఉద్యోగం చేయాల్సి వచ్చింది. మనకు వీలైన సమయంలో ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉన్నది డెలివరీ బాయ్ వృత్తిలోనే. అందుకే దీన్ని ఎంచుకున్నా. అయితే నాకు వెహికిల్ లేకపోవడం కారణంగా ఆర్డర్స్ అధికంగా చేయలేకపోతున్నా. నా కష్టాన్ని గుర్తించి నాకు బైక్ అందించిన రాబిన్, రవికాంత్ రెడ్డి, ఇతర ఫేస్బుక్ పేజీ సభ్యులకు ధన్యవాదాలు.’ అని కృతజ్ఞత చాటుకున్నాడు.