సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 18వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమాన్ని హైదరాబాద్ జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా స్రీనింగ్ కోసం వచ్చే నగర వాసులకు తాగునీరు, టాయిలెట్లు, టెంటు, కుర్చీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లా పరిధిలోని 91 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మొత్తం 152 స్రీనింగ్ కేంద్రాల ద్వారా 45,38,821మందికి 100 రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. రీడింగ్ సమస్య ఉన్న వారికి వెనువెంటనే అద్దాలను పంపిణీ చేయనున్నారు. ప్రిస్రిప్షన్ ప్రకారం కావాల్సిన వారికి కంటి అద్దాలను వారి ఇంటికే పంపించే ఏర్పాటు కూడా చేస్తున్నామని, కంటి చికిత్స, మందులు, కంటి అద్దాలు ఉచితంగా అందరికీ అందజేస్తామని చెప్పారు.