శామీర్పేట, జనవరి 24 : ఉద్దెమర్రిలో సోమవారం రాత్రి మద్యం దుకాణం సిబ్బందిపై కాల్పులు జరిపిన దుండగులు.. రెండు లక్షల నగదు తీసుకొని పారిపోయారు. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది. శామీర్పేట పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఉమ్మడి శామీర్పేట మండలానికి చెందిన జైపాల్రెడ్డి, బాలకృష్ణ ఉద్దెమర్రిలోని వినాయక వైన్స్లో పనిచేస్తున్నారు. రోజువారీ మాదిరిగానే సోమవారం రాత్రి 10 గంటల సమయంలో వైన్స్ మూసివేశారు. ఆ రోజు వచ్చిన కలెక్షన్ రూ.2,08,500 తీసుకొని సంచి (బ్యాగ్)లో పెట్టుకున్నారు. రాత్రి 10:23 గంటల సమయంలో బాలకృష్ణ షట్టర్కు తాళం వేస్తుండగా.. జైపాల్రెడ్డి నగదు ఉన్న సంచిని పట్టుకున్నాడు. అదే సమయంలో బైక్పై వచ్చిన ముగ్గురు దుండగులు ఒక్కసారిగా వారిద్దరిపై దాడికి పాల్పడ్డారు. మనీ దేవో.. అంటూ పెనుగులాడుతూ పక్కనే ఉన్న కర్రలతో వైన్స్ సిబ్బందిపై దాడి చేశారు. ఈ దాడిలో జైపాల్రెడ్డి పట్టుకున్న నగదు సంచి కింద పడిపోయింది.
నగదు సంచిని తీసుకొని పారిపోతున్న దుండగులపై వైన్స్ సిబ్బంది ఎదురు దాడికి దిగారు. దీంతో పారిపోతున్న దుండగుల్లో ఒకరు పిస్టల్తో బాలకృష్ణపై కాల్పులు జరిపాడు. బాలకృష్ణ చాకచక్యంగా తప్పించుకున్నాడు. మరో రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపిన దుండగుడు బైక్పై మూడుచింతలపల్లి వైపు పారిపోయారు. కాగా, దుండగులు జరిపిన కాల్పుల్లో తూటలు వైన్షాపు షట్టర్ నుంచి దుకాణంలోకి దూసుకుపోయాయి. దీంతో మద్యం బాటిళ్లు ధ్వంసమయ్యాయి. ఈ విషయాన్ని వెంటనే తన యజమానికి ఫోన్ ద్వారా వివరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాల్లో గాలించారు. బాలానగర్ డీసీపీ, పేట్బషీర్బాగ్ ఏసీపీ, శామీర్పేట సీఐ సుధీర్కుమార్ సిబ్బందితో కలిసి సీసీ టీవీల ఫుటేజీలను పరిశీలించారు. దుండగుల కోసం పరిసర ప్రాంతాలు, సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. దుండగుల వయస్సు 25 నుంచి 30 ఏండ్లు ఉంటుందని, ఫ్యాషన్ బైక్ మాదిరిగా ఉన్న వాహనంపై వచ్చినట్లు బాధితులు తెలిపారు. ముగ్గురిలో ఒకరు ముఖానికి దస్తీ కట్టుకున్నాడని, మరో ఇద్దరికీ మంకీ క్యాప్లు ఉన్నాయని చెప్పారు.
తృటిలో తప్పిన ప్రమాదం..
ఉద్దెమర్రి ఘటనలో పెను ప్రమాదం తప్పింది. దుండగులు తమ వెంట తెచ్చుకున్న పిస్టల్తో బాలకృష్ణపైకి కాల్పులు జరిపారు. గమనించిన బాలకృష్ణ చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఆ బుల్లెట్ షట్టర్లోకి దూసుకెళ్లింది. ఆ మెరుపుదాడిలో బుల్లెట్ నుంచి బాలకృష్ణ తప్పించుకోవడంతో తృటిలో ప్రమాదం తప్పిపోయింది.
ముమ్మర గాలింపులు..
ఉద్దెమర్రి ఘటనలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దుండగుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. బాలానగర్ డీసీపీ సందీప్, పేట్బషీర్బాగ్ ఏసీపీ, శామీర్పేట పోలీసులు కలిసి శామీర్పేట మండలాన్ని జల్లెడ పడుతున్నారు. మూడుచింతలపల్లి మండల పరిధిలోని మూడుచింతలపల్లి, ఉద్దెమర్రి గ్రామాల్లోని సీసీ టీవీలతో పాటు బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాల ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. ఈ కేసును చాలెంజ్గా తీసుకున్న పోలీసులు.. త్వరలోనే దుండగులను పట్టుకుంటామని చెబుతున్నారు.