కుత్బుల్లాపూర్ జోన్ బృందం, జనవరి 21: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం వ్యాప్తంగా నిజాంపేట్ కార్పొరేషన్, దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీలతో పాటు కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో శుక్రవారం ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించారు. జంట సర్కిళ్ల పరిధిలో ఉపకమిషనర్లు ప్రశాంతి, మంగతాయారులతో పాటు ఇతర శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి సర్వే చేపట్టారు. నిజాంపేట్ మున్పిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి, కమిషనర్ శంకరయ్య నేతృత్వంలో సర్వేను ప్రారంభించారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో చైర్పర్సన్ సుంకరి కృష్ణవేణిక్రిష్ణలతో పాటు కమిషనర్ భోగీశ్వర్లు, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్ సన్నా శ్రీశైలంయాదవ్, వైస్ చైర్మన్ రత్లావత్ గంగయ్యనాయక్, కమిషన్ రఘులతో పాటు ఆయా శాఖల అధికారులు, సిబ్బంది సర్వేలో భాగస్వాములై ప్రజలకు భరోసా కల్పించారు.