హైదరాబాద్, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఎగుమతులను ప్రోత్సహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం హైదరాబాద్లోని ఎఫ్టీసీసీఐ కార్యాలయంలో తెలంగాణ పరిశ్రమల శాఖతోపాటు ఫార్మెక్సిల్, పలు ఇతర సంస్థలు సంయుక్తంగా వాణిజ్య సప్తాహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఇందులో భాగంగా వివిధ ఉత్పత్తులతో కూడిన ప్రదర్శనతోపాటు ఎగుమతి అవకాశాలపై సదస్సును నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బయోలాజికల్/వ్యాక్సిన్స్, ఫార్మాస్యూటికల్స్, బల్క్డ్రగ్స్, ఐటీ, ఇంజినీరింగ్ (ఎయిరో స్పేస్/ డిఫెన్స్), మెడికల్ డివైజెస్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, అగ్రికల్చర్ (ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ స్పైసెస్), టెక్స్టైల్స్ తదితర రంగాల్లో ఎగుమతులకు అపార అవకాశాలున్నాయన్నారు.
ఎగుమతులకు అనుగుణంగా ఉత్పత్తుల నాణ్యతను పెంచుకోవాల్సిన అవసరం ఉందని, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వపరంగా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. బయోటెక్నాలజీ రంగంలో దేశం ఎంతో అభివృద్ధిని సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణల ద్వారా ఎగుమతులను పెంపొందించుకునే వీలుందని చెప్పారు. కార్యక్రమంలో వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు పాల్గొన్నారు. మరోవైపు, వాణిజ్య సప్తాహ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి తదితర మూడు జిల్లాల్లో ఎగుమతుల పెంపునకు తీసుకుంటున్న చర్యలు, జిల్లాలోని ప్రధాన ఉత్పత్తులు, సేవలు, ఎగుమతిదారుగా ఎదిగేందుకు అవసరమైన మెళుకువలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న ఎగుమతుల ప్రోత్సాహకాలు, ప్రముఖులతో చర్చలు నిర్వహిస్తున్నారు.